మెదక్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గత నెలతో పోలిస్తే ఈ నెలలో భూగర్భ జలమట్టం మరింత పెరగడం గమనార్హం. మెదక్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జల శాఖ అధికారులు 56 ప్రాంతాల్లో భూగర్భ జల మట్టం సేకరించారు. జూలై 21వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలశాఖ అధికారులు సేకరించిన సమాచారం మేరకు నెలతో పోలిస్తే 0.93 మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగాయి. జిల్లా పరిధిలో జూన్లో సరాసరి భూగర్భ జలమట్టం 12.60 మీటర్లు ఉండగా, జూలైలో 11.67 మీటర్లకు వచ్చింది. 0.93 మీటర్లు పెరిగింది.
జిల్లాలో పెరిగిన భూగర్భ నీటి మట్టంతో వ్యవసాయ బోర్లు, బావుల పరిధిలో సాగుకు మరింత ఉపయోగకరంగా మారింది. వ్యవసాయ బావుల వద్ద కూరగాయలు, పండ్ల తోటలు, వరి, ఇతర పంటలను రైతులు సాగు చేసే అవకాశం కలిగింది. గత వానకాలం సీజన్లో 2 లక్షల ఎకరాలకు పైగా పంటలను రైతులు సాగు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో పత్తి, మొక్కజొన్న పంటలు వేశారు.
వానకాలంలో భారీ వర్షాలు కురవడంతో బోర్లల్లో పుష్కలంగా నీరు చేరింది. గతంలో వదిలేసిన బోర్లలో కూడా నీరు ఉబికి వస్తుండడంతో రైతులు మోటర్లు బిగిస్తున్నారు. పాతాళ గంగ పైపైకి రావడంతో ఈ వానకాలంలో భూగర్భ జల మట్టం బాగా పెరిగింది. వానకాలం సీజన్ ఆరంభంలోనే తొలకరి జల్లులు కురవడం, వెంటనే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మధ్యలో ఒకటి, రెండు రోజులు వరుణుడు ముఖం చాటేసినా తర్వాత నిరాటంకంగా కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. దీంతో ఎత్తిపోయిన బోరుబావులన్నీ తిరిగి పుంజుకున్నాయి. ఈ వానకాలంలో సాధారణ వర్షపాతం నుంచి అధిక వర్షపాతం నమోదైంది. జూన్లో 99.5 మి.మీ వర్షం కురవగా, జూలైలో 523.2 మి.మీ వర్షం కురిసింది. అంటే 85శాతం అధికంగా వర్షం కురిసింది. వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ నిండి పొంగిపొర్లాయి. దీంతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. మెదక్ జిల్లాలో 3.10 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా వేయగా, ఇప్పటి వరకు 1.90 లక్షల వరకు వరి నాట్లు వేశారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా జూలై నెల ప్రారంభం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలోని అనేక మండలాల్లో భూగర్భ జలమట్టం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 56 ప్రాంతాల్లో భూగర్భ నీటి మట్టాన్ని పరిశీలించాం. జూన్తో పోలిస్తే జూలైలో జిల్లాలో సరాసరి 0.93 మీటర్లు భూగర్భ జలమట్టం పెరిగింది. భూగర్భ జలమట్టం పరిశీలన తర్వాత మళ్లీ వర్షాలు కురియడంతో మరింత పెరిగే అవకాశం ఉన్నది.
– వెంకటేశ్వర్రావు, మెదక్ జిల్లా భూగర్భ జల అధికారి