వెల్దుర్తి, మార్చి 29 : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మసాగర్ నుంచి వస్తున్న గోదావరి జలాలతో మాసాయిపేట మండల పరిధిలోని హాల్దీప్రాజెక్టు నిండుకుండలా ఉంది. శనివారం సాయంత్రం మాసాయిపేట మండలంలో ప్రవేశించిన గోదావరి జలాలు ఆదివారం తెల్లవారుజామున మాసాయిపేట చెక్డ్యాం పొంగి సుమారు కిలోమీటరు దూరం ప్రవహించి సాయంత్రానికి హాల్దీప్రాజెక్టుకు చేరుకున్నాయి. గోదావరి నీళ్లతో హాల్దీప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. రెండు ఫీట్ల మేర నిండితే నేటి సాయంత్రానికి హాల్దీ ప్రాజెక్టు అలుగు పారే అవకాశం ఉందని సంబంధిత అధికారులు, రైతులు తెలిపారు. హాల్దీప్రాజెక్టు అలుగు పారిన అనంతరం వెల్దుర్తి మండలంలో ప్రవేశించి మండలంలోని ఎనిమిది చెక్డ్యాంలను నింపుతూ మంజీరాలోకి గోదావరి జలాలు వెళ్లనున్నాయి.