సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 16: 13వ జాతీయ ఓట రు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి 13వ జాతీయ ఓటరు దినోత్సవ నిర్వహణపై స్వీప్ నోడల్ అధికారి, వివిధ కళాశాలల అధికారులు, ఏఈఆర్వోలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు గుర్తు చేశారు. జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగా చేపట్టే వివిధ కార్యక్రమాలను కొవిడ్ నిబంధనల మేరకు నిర్వహించాలని స్పష్టం చేశారు. జాతీయ ఓటరు దినోత్సవంపై విస్తృత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కలిగేలా చేయాలన్నారు. ఇండ్లలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని జిల్లా స్థాయి, ఈఆర్వో స్థాయిలో, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహించాలని సూచించారు.
కొత్త ఓటర్లను సన్మానించి వారికి ఎపిక్ కార్డులను అందజేయాలన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా ఎన్నికల అధికారి జాతీయ ఓటరు దినోత్సవన్ని వివిధ విద్య సంస్థలు, పం చాయతీరాజ్, సివిల్ సొసైటీ గ్రూప్స్, యూత్ వాలంటరీస్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువకేంద్ర, మీడియా తదితర వారి సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జాతీయ ఓటరు దినోత్సవ ప్రతి జ్ఞ చేయించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్వీప్ నోడల్ అధికారి సురేశ్ మోహన్, ఆర్డీవోలు, విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లు, అధికారులు పాల్గొన్నారు.