నర్సాపూర్, డిసెంబర్ 23 : దివంగత జడ్పీటీసీ వాకిటి లక్ష్మారెడ్డి 60వ జయంతిని పురస్కరించుకొని లక్ష్మారెడ్డి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఐదు రోజులుగా సాగిన టోర్నమెంట్ ఫైనల్ పోటీకి ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆటను వీక్షించారు.
ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో శివ్వంపేట మండలం గుండ్లపల్లి గ్రా మానికి చెందిన జట్టు విజేతగా, హత్నూరా మండలం కాసాల గ్రామానికి చెందిన జట్టు రన్నర్గా నిలిచాయి. మూడో స్థానం లో కౌడిపల్లి మండలం తునికి గ్రామ జట్టు, నాల్గో స్థానంలో శివ్వంపేట్ మండలం కొంతాన్పల్లి గ్రామ జట్టు నిలిచాయి. విజేతలకు మెమెంటోతోపాటు నగదు పురస్కరాలను మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో రాణించాలని సూచించారు. నర్సాపూర్లో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇండోర్ స్టేడియాన్ని సైతం నిర్మిస్తామన్నారు. క్రీడాస్ఫూర్తితో టోర్నమెంట్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలి పారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైడి శ్రీధర్గుప్తా, వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.