సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 2: చిట్టి మెదడుకు గట్టి పదును పెట్టి విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు అద్భుతంగా ఉన్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి ఇన్స్పైర్, 50వ రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి హరీశ్రావు తిలకించారు. విద్యార్థులు రూపొందించిన పలు ఎగ్జిబిట్లను చూసి అబ్బురపడ్డారు. విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, వైద్య విద్య, అటవీ, వ్యవసాయం, ఫిషరీస్, పశు సంవర్ధక, ఇతర విద్య అనుబంధ సంస్థలపై ఏటా వేలాది కోట్ల నిధులు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూళ్లను రద్దు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వం బాధ్యత తీసుకుందన్నారు. ఏటా బడ్జెట్లో 10శాతం నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ‘మనఊరు-మనబడి’ పథకం ద్వారా రూ.7 వేల కోట్లు కేటాయించి బడుల ఆధునీకరణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థినులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది విద్యార్థినులకు హెల్త్ హైజెనిక్ కిట్స్-శానిటరీ కిట్స్ పంపిణీ కార్యక్రమం మరో 20 రోజుల్లో ప్రారంభం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పదో తరగతిలో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని, జిల్లాలో పదో తరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు స్వయంగా తానే ఉత్తరం రాసి, వారికి స్ఫూర్తిని ఇచ్చినట్లు తెలిపారు. మళ్లీ మొదటి స్థానం వచ్చేలా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ బృందాన్ని కోరారు. జిల్లా పదో తరగతి ఫలితాల్లో మొదటి స్థానం నిలిచేలా కావాల్సిన సంపూర్ణ సహకారాన్ని తాను అందిస్తానని అధికారులకు మంత్రి భరోసా ఇచ్చారు. సిద్దిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత-స్వచ్ఛతపై అవగాహన పెంచేలా స్వచ్ఛబడిని సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా రెండో రోజు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కొనసాగింది. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు తిలకించారు. రెండో రోజూ జిల్లాలోని చిన్నకోడూరు, నారాయణరావుపేట, దుబ్బాక, మిరుదొడ్డి, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, కొండపాక, గజ్వేల్, ములుగు, మర్కూక్ మండలాల విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించారు. మూడు రోజుల జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నేటితో ముగియనున్నది.