సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 2 : జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ‘భూ’ సేకరణ పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో వివిధ అభివృద్ధి అంశాలపై డివిజన్ వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి భూ సేకరణ వేగవంతంగా పూర్తి చేసి, ఆయా భూములకు సంబంధించి అవార్డు పాస్ చేసి భూమిని స్వాధీనం చేయాలని సంబంధిత ఆర్డీవోలకు సూచించారు. ఎలాంటి సమస్యలు లేకుండా త్వరితగతిన భూసేకరణ పూర్తి కావాలన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర నేషనల్ హైవే 161లకు సంబంధించి భూసేకరణ స్వాధీనం చేసిన భూమి వివరాలను ఆరా తీశారు. నారాయణఖేడ్ డివిజన్లో కొత్తగా మంజూరైన చెరువులకు సంబంధించి భూమిని స్వాధీనం చేయాలని సంబంధిత తహసీల్దార్ ఆర్డీవోకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలని కోరారు. ధరణిలో ఎలాంటి సమస్యలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలన్నారు. అన్ని మండలాలకు సంబంధించి రెండు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పరిష్కరించాలన్నారు. ధరణి సమస్యల పరిష్కారంలో నాగల్గిద్ద, మనూర్ తహసీల్దార్లు బాగా పని చేస్తున్నారని కలెక్టర్ అభినందించారు. ఈ నెల 13లోగా పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. ఈ నెల 7లోగా ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం, కనీసం 80 శాతం పూర్తి కావాలన్నారు. చౌక ధరల దుకాణాల డీలర్ల ఖాళీలను నోటిఫై చేయాలని ఆర్డీవోలకు సూచించారు. 15 రోజుల పాటు దృష్టి సారిస్తే అన్ని సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అవినాష్ నాయక్, సర్వే అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
పోడు భూములపై డివిజినల్ స్థాయి సమీక్షా సమావేశాన్ని గురువారం తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించారు. ఆర్డీవో శ్యాంప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని నిర్ణయించారు. పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల దరఖాస్తులు ఆమోదించినప్పటికీ, క్షేత్రస్థాయిలో విస్తీర్ణం సరిపోలేని భూముల సమస్యలు పరిశీలించారు. పోడు భూముల పట్టాల పంపిణీకి ప్రభుత్వం 2005 కటాఫ్గా నిర్ణయించిందని, 2005 కంటే ముందు నుంచి నేటి వరకు పోడు భూముల్లో సాగు చేసుకుంటూ, పొజిషన్లో ఉన్న అర్హులైన ఎస్టీ దరఖాస్తుదారులకు పట్టాలు ఇచ్చామని ఆర్డీవో తెలిపారు. సమీక్షలో ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.