నంగునూరు, జనవరి 16: అధికారుల సర్వేలో తమ పేర్లు రాలేదని, దీంతో రేషన్ కార్డులు రావేమోనని పాలమాకులకు చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డులు రాక ఇబ్బందులు పడుతున్నామని, అధికారుల తప్పిదంతో సర్వే లిస్టులో తమ పేర్లు గల్లంతయ్యాయని పాలమాకుల గ్రామస్తులు అధికారులను నిలదీశారు. నంగునూరు మండలంలోని నంగునూరు, పాలమాకుల, గట్లమల్యాల, సంతోష్నగర్, కోనాయిపల్లి గ్రామాల్లో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు గురువారం సర్వే నిర్వహించారు.
పాలమాకులలో తహసీల్దార్ సరిత అధికారులతో కలిసి గ్రామంలో ఇంటింటా సర్వే చేపట్టారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవని ప్రజలు ప్రశ్నించారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన జాబితా ప్రకారం సర్వే చేస్తున్నామని తహసీల్దార్ వారికి సమాధానం ఇచ్చారు. సుమారుగా 900 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, పూర్తి జాబితా వచ్చేవరకు సర్వే చేయవద్దని కోరారు. సర్వేను అడ్డుకోవద్దని చెప్పినా వారు వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల వినతి మేరకు తహసీల్దార్ సరిత, జిల్లా కలెక్టర్కు, డిస్టిక్ సివిల్ సైప్లె అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య వివరించారు. వారి సూచన మేరకు గ్రామస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నంగునూరు, కోనాయిపల్లిలో కొత్త రేషన్కార్డు సర్వేలో తమ పేర్లు లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.