మెదక్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : భారత ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023కు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని తెలిపారు. 24 గంటల వ్యవధిలో రాజకీయ పార్టీలు, నాయకులకు సంబంధించిన హోర్డింగులు, ఫొటోలు, వాల్ రైటింగ్స్ తొలిగించాలని, 48 గంటల్లో పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు ఫొటోలు తీసేయాలని, ప్రైవేట్ స్థలాల్లో హోర్డింగులు, ఫ్లెక్సీలు, ఫొటోలను 72 గంటల్లో తొలిగించాలని అధికారులకు ఆదేశించారు.
నోటిఫికేషన్ విడుదల అయ్యేలోగా ఫ్ల్లయింగ్ స్వాడ్ బృందాలు, కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ఏర్పాటు, ఎన్నికల విధుల నిర్వహణకు సిబ్బందికి శిక్షణ తదితర కార్యక్రమాలు పూర్తి చేయాలని పేర్కొన్నారు. శాంతి భద్రతల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించి నివేదికలు ప్రతి రోజూ సమర్పించే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఇతర ఫిర్యాదులు స్వీకరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో రిటర్నింగ్ అధికారులకు భద్రత ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో అన్ని అంశాలు నింపారో లేదో చెక్ చేసుకోవాలన్నారు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం ఓటింగ్ స్లిప్పుల పంపిణీ చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో డీఆర్వో పద్మశ్రీ, జడ్పీ సీఈవో శైలేశ్, సీపీవో కృష్ణయ్య, డీఎఫ్వో రవి ప్రసాద్, డీఈవో రాధాకృష్ణ, అదనపు ఎస్పీ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.