సంగారెడి అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ): పాడి రైతులను కలవరపెడుతున్న లంపీస్కిన్పై సంగారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని తెల్లజాతి పాడి పశువులు, ఎద్దులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా పశు సంవర్ధక శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో ఇప్పటి వరకు ఈ వ్యాధి బారినపడి ఒక్క పశువు కూడా మృతి చెందలేదు. కొన్ని పశువుల్లో వ్యాధి లక్షణాలు ఉన్నట్లు రైతులు చెబుతుండంతో అధికారులు అప్రమత్తమై రోగ నిర్ధారణ కోసం పశువుల నుంచి శాంపిల్స్ సేకరించారు. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు, గుమ్మడిదల మండలా ల్లో మొత్తం 22 లంపీస్కిన్ అనుమానిత కేసులను పశుసంవర్ధకశాఖ అధికారులు గుర్తించారు. ఈ పశువుల నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కు పంపించారు. రెండు, మూడు రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ఆవులు, ఎద్దులు ఈ వ్యాధి బారిన పడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తుగా పశువులకు గోట్పాక్స్ వ్యాక్సిన్ వేయిస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో సైతం ఈ వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం జిల్లాకు మొదటి విడతగా 9వేల వ్యాక్సిన్లు, రెండో విడతలో 55 వేల వ్యాక్సిన్లను సరఫరా చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పశు సంవర్ధకశాఖ అధికారులు జిల్లాలో లంపీస్కిన్ వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
లంపీస్కిన్ వ్యాధి ఎలా వస్తుంది?
పశువైద్య అధికారుల సమాచారం మేరకు తెల్లజాతి ఆవులు, ఎద్దులకు లంపీస్కిన్ వ్యాధి వస్తున్నది. పశువులకు దోమలు, జొర్రీగలు, పిడుదులు కుట్టడంతో లంపీస్కిన్ వ్యాధి వస్తున్నది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో తీవ్ర జ్వరం, కాళ్ల వాపు ఉంటుంది. చర్మంపై దద్దులు వస్తాయి. పాడి పశువులు పాలు తక్కువగా ఇస్తాయి. ఈ వ్యాధి లక్షణాలను రైతులు గుర్తించిన వెంటనే ఆ పశువులను మంద నుంచి పక్కన ఉంచాలి. పశువుల పాకలను ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేసుకోవాలి. రాత్రిపూట వేప ఆకులతో పొగ వేసుకోవాలి. దీంతో దోమలు, ఈగల బెడద తగ్గుతుంది. వెంటనే సమాచారాన్ని సమీపంలోని పశువైద్యాధికారి తెలుపాలి. పశుసంవర్ధకశాఖ అధికారులు శాంపిల్స్ సేకరించి వ్యాధి సోకిందీ లేనిది తెలుసుకుంటారు. ఒక వేళ లంపీస్కిన్ వ్యాధి సోకితే ఆ పశువులకు వ్యాక్సిన్లు వేయడంతోపాటు చికిత్స అందజేస్తారు.
రైతులు ఆందోళన చెందవద్దు
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పశువు లంపీస్కిన్ వ్యాధితో చనిపోలేదని, అలాంటి ప్రచారాలు నమ్మవద్దని పశు సంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డా.వసంతకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు, గుమ్మడిదలో రైతులు తమ పశువులకు లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు ఉన్నాయని చెబితే శాంపిల్స్ సేకరించి, వ్యాధి నిర్ధారణ కోసం వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కు పంపించినట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో వాటి ఫలితాలు వస్తాయని చెప్పారు. లంపీస్కిన్ వ్యాధి సోకినట్లు తేలితే వాటికి వెంటనే చికిత్స అందజేస్తామన్నారు. జిల్లాలో తెల్లజాతి ఆవులు, ఎద్దులకు ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగా గోట్ఫాక్స్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 9వేల వ్యాక్సిన్ వేసినట్లు వివరించారు. 55వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, జిల్లా అంతటా పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా లంపీస్కిన్ కేసు నమోదైతే ఆ ప్రాంతం నుంచి ఐదుకిలోమీటర్ల వ్యాసార్థంలో పశువులన్నింటికీ వ్యాక్సిన్ వేస్తామన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఈ వ్యాధి సోకిన పశువులు తెలంగాణలోకి రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. కానుకుంటలో లంపీస్కిన్ వ్యాధితో పశువులు చనిపోయాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని స్పష్టం చేశారు.