కొండాపూర్, ఏప్రిల్ 30: మెదక్ ఎంపీ స్థానంలో మరోసారి గులాబీ జెండానే ఎగురుద్దని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అనంతసాగర్, సైదాపూర్, అలీయాబాద్, తొగర్పల్లి గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అమలుకాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పథకాలను పక్కనబెట్టి గాలి మాటలతో పబ్బం గడుపుతున్నారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రణమాఫీ, రూ.15 వేల రైతుబంధు, కల్యాణ లక్ష్మీలో తులం బంగారం వంటి పథకాల అమలు ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మాజీ సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యకర్తలు గ్రామాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను వివరిస్తూ బీఆర్ఎస్కు ఓటు వేసేలా ప్రచారం ముమ్మ రం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ గెలు పే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. గెలిచిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు అని చెప్పి మోసం చేసిన రేవంత్రెడ్డికి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకపోతే దిగిపోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మావతీపాండురంగం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు మల్లేశం, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు రుక్మొద్దీన్, నాయకులు మల్లాగౌడ్, గోవర్ధన్రెడ్డి, ఇంద్రారెడ్డి, నగేశ్, రామాగౌడ్, నర్సింహులు, జడ్పీ కోఆప్షన్ అమీనొద్దీన్, జగదీశ్వర్, ఫయిం, తదితరులు పాల్గొన్నారు.