సిద్దిపేట, మార్చి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ పి.వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు శేరిసుభాష్రెడ్డి, వంటేరు యాదవరెడ్డి, వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పార్టీ అభ్యర్థిగా పి.వెంకట్రామిరెడ్డిని ప్రకటించారు. ఇప్పటికే జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి గాలి అనిల్కుమార్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించగా, ఆయన పార్టీ క్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మెదక్, జహీరాబాద్ రెండు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు. రెండుచోట్ల విజయం సాధించి మరోసారి సత్తా చాటేలా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లాతో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి అనుబంధం ఉంది. జాయింట్ కలెక్టర్, కలెక్టర్గా సుదీర్ఘకాలం పాటు జిల్లా ప్రజలకు ఆయన సేవలు అందించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్, హరీశ్రావుకు సన్నిహితంగా ఉంటూ పార్టీ అప్పగించిన బాధ్యతలను నెరవేర్చారు. గత శాసనసభ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించి పార్టీ అభ్యర్థి విజయానికి కృషిచేశారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. అధికారిగా జిల్లాలో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై జిల్లా అభివృద్ధికి కృషిచేశారు. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పాత కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండల కేంద్రం. తండ్రి రాజిరెడ్డి ప్రముఖ న్యాయవాది. వెంకట్రామిరెడ్డి 1996లో గ్రూప్-1 ఉద్యోగం సాధించి డిప్యూటీ కలెక్టర్గా చేరి, అనంతరం ఆర్డీవోగా బందరు, చిత్తూరు, తిరుపతిలో పనిచేశారు. పీడీ డీడబ్ల్యూఎంఏ మెదక్, హుడా సెక్రటరీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, ఇన్క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించాడు. 2007లో ఐఏఎస్ హోదా పొందారు. ఆయన 24 మార్చి 2015 నుంచి 10 అక్టోబర్ 2016 వరకు ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన తరువాత 11 అక్టోబర్ 2016 నుంచి సిద్దిపేట కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 2018 సార్వత్రిక ఎన్నికల సమయంలో 8 నెలల పాటు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ పనిచేశారు. తర్వాత 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సంగారెడ్డి కలెక్టర్గా పనిచేశారు. ఎన్నికల అనంతరం తిరిగి సిద్దిపేట కలెక్టర్గానే బాధ్యతలు చేపట్టి 15 నవంబర్ 2021న సిద్దిపేట కలెక్టర్గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి, స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బీఆర్ఎస్లో చేరారు. 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 30 నవంబర్ 2027 వరకు ఆయన పదవీకాలం ఉంది. ఏడేండ్ల పైగానే ఉమ్మడి మెదక్ జిల్లా జాయిం ట్ కలెక్టర్, సిద్దిపేట కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి బాధ్యతలు నిర్వర్తించి అభివృద్ధికి కృషిచేశారు.
వెంకట్రామిరెడ్డి కలెక్టర్ ఉన్న సమయంలో సిద్దిపేట జిల్లాలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో జిల్లాలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణానికి భూసేకరణ చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఎక్కడా లేనివిధంగా 6వేల కుటుంబాలకు ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించడం విశేషం. మిషన్ భగీరథ లాంటి పథకాన్ని వందశాతం పూర్తి చేయడంతో పాటు రైల్వేలైన్కు సంబంధించి భూసేకరణను 90శాతం పూర్తి చేయడంలో విశేష కృషిచేశారు. జిల్లాలోని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. పేద విద్యార్థులను అక్కున చేర్చుకున్నారు. రాధా, రమణి అనే అనాథ పిల్లలకు ఆలనా పాలనా అన్నీ తానే చూస్తున్నారు. సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరయ్యారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేశారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని ప్రకటించడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జోష్లో ఉన్నారు. జహీరాబాద్ నుంచి గాలి అనిల్కుమార్, మెదక్ నుంచి పి.వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట జిల్లాలోకి వచ్చే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్కుమార్ను ప్రకటించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ పార్లమెంట్ పరిధిలో అన్ని శాసనసభ స్థానాలను తిరుగుతూ పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను కలుస్తున్నారు. మెదక్ అభ్యర్థిగా పి.వెంకట్రామిరెడ్డిని ప్రకటించడంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించడానికి పార్టీ సమాయత్తం అవుతున్నది. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 26 నుంచి 30 వరకు పార్టీ సమావేశాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మెదక్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారని, సమావేశంలో ఏకాభిప్రాయంతో తన పేరును ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. తన పేరును ప్రతిపాదించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు పదేండ్లు అధికారిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములు చేసినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించానన్నారు. ప్రజలతో మమేకమై ఉన్నందునే ఈ అవకాశం దక్కిందని, మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసే భాగ్యం కేసీఆర్ కల్పించడం చాలా సంతోషంగా ఉందని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.