నర్సాపూర్, సెప్టెంబర్ 14: నర్సాపూర్ మున్సిపాలిటీ దినదినాభివృద్ధి చెందుతున్నది. జనాభాకు తగ్గ సౌకర్యాల కల్పనతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, మున్సిపల్ భవనం తదితర నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీటితోపాటు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. మరో రెండు నెలల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తయితే తమ ఇక్కట్లు తీరినట్లేనని మున్సిపల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.6 కోట్లతో నిర్మాణ పనులు
నర్సాపూర్ పట్టణంలో కూరగాయల కోసం పట్టణ ప్రజలే కాకుండా మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఎక్కువగా నర్సపూర్కు వస్తుంటారు. శుక్రవారం సంత కావడంతో ఇసుక వేస్తే రాలనంత జనంతో మున్సిపాలిటీ కిక్కిరిపోతున్నది. కూరగాయలు, చికెన్, మటన్, చాపలు కొనుక్కోవడానికి ప్రజలకు, అటు అమ్ముకోడానికి వ్యాపారులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి నర్సాపూర్ మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో, ఎమ్మెల్యే మదన్రెడ్డి చొరవతో మంత్రి హరీశ్రావు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలోని పాత రెవెన్యూ కార్యాలయ స్థలంలో ఎకరా 20 గుంటల విస్తీర్ణంలో రూ.2 కోట్లతో మార్కెట్ నిర్మిస్తున్నారు. మొదట్లో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే నిర్మించాలని నిర్ణయించినా తర్వాత మరో రూ.4 కోట్లు అదనంగా మంజూరు చేసి జి ప్లస్ వన్ నిర్మించాలని నిర్ణయించారు. మొదట్లో 48 సాళ్లు నిర్మించాలని ప్రభుత్వం భావించినప్పటకి అదనంగా పెంచిన స్టాళ్లతో కలిపి 62 స్టాళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే జి ప్లస్ వన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
పనులు చురుగ్గా సాగుతున్నాయి
నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మున్సిపాలిటీలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నాయి. మున్సిపాలిటీలో వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, మున్సిపల్ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి అయితే ప్రజలు, వ్యాపారుల ఇబ్బందులు తొలిగిపోతాయి.
– మదన్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
మూడు నెలల్లో నిర్మాణం పూర్తి
మూడు నెలల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ నిర్మాణ పనులను పూర్తవుతాయి. ప్రభుత్వం ముందుగా మంజూరు చేసిన గ్రౌండ్ ఫ్లోర్ పనులు ఎప్పుడో పూర్తి చేశాం. అదనంగా జి ప్లస్ వన్ నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించడంతో నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగింది. ఇప్పటివరకే జీ ప్లస్ వన్ నిర్మాణం పూర్తయింది. మొదటి ఫ్లోర్లో ఆర్చ్ నిర్మాణం, బ్యూటిఫికేషన్ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. కాంట్రాక్టర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తైతే నర్సాపూర్ పట్టణానికే అందం వస్తుంది. జీ ఫ్లస్ వన్ మంజూరు కావడంతో డిజైన్స్ మార్చాం. డిజైన్ ఫైనల్ అయ్యాక కాంట్రాక్టర్ మిగతా పనులు ప్రారంభిస్తారు.
– వెంకట్ గోపాల్, మున్సిపల్ కమిషనర్, నర్సాపూర్