న్యాల్కల్, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో మరో బాసరగా విరాజిల్లుతున్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్లోని సిద్ధి సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం వసంత పంచమి ఉత్సవాలకు ముస్తాబైంది. క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో ఈనెల 14న సరస్వతీ అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తారు. క్షేత్ర సమీపంలోని మంజీరా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లు చేశారు. క్షేత్రంలోని సరస్వతీ అమ్మవారితో పాటు సాయిబాబా, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి, సూర్యభగవాన్, గంగామాతను భక్తులు దర్శించుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని చేయించేందుకు క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో ఊరేగింపుగా మంజీరానదికి వెళ్లి, నదిలో తెప్పను విడిచి గంగామాతకు మహా హారతి ఇస్తారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తారు. మహిళలు బోనాలు సమర్పిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై సరస్వతీ అమ్మవారిని ఊరేగిస్తారు.15న క్షేత్రంలో సరస్వతీ అమ్మవారికి డోలారోహణం, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం, 16న రథసప్తమిని పురస్కరించుకొని క్షేత్రంలోని సూర్యభగవాన్ను ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంలో ఊరేగిస్తారు. భక్తుల సౌకర్యార్థం షామియానాలు, తాగునీరు, అన్నదానం, వాహనాల పార్కింగ్ తదితర సదూపాయాలు కల్పిస్తున్నారు. జహీరాబాద్ రూరల్ సీఐ నోముల వెంకటేశ్, హద్నూర్ ఎస్సై రామానాయుడు, పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.