గజ్వేల్, ఏప్రిల్ 1: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ మోసం చేసిందని, గురువారం నుంచి జరగనున్న గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలని పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి పిలుపునిచ్చారు. ఈసందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా దాటవేస్తున్నదని, గ్రామసభలకు ఎమ్మెల్యేలు, మంత్రులను వెళ్లనీయకుండా అధికారులతోనే సభలు నడపేందుకు నిర్ణ యం తీసుకుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే భావన వారిలోనే వచ్చిందన్నారు.
అధికారంలోకి వస్తే అనేక హామీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి నేడు ప్రజల ముందుకు వెళ్లే దమ్ములేక ముఖం చాటేశారన్నారు. 24గంటల కరెంట్ ఇవ్వకుండా రైతులను మోసం చేసిందన్నారు. రైతులకు పంట రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఆటో డ్రైవర్లకు రూ.12వేలు, నిరుద్యోగులకు రూ.4వేలు, పింఛన్ రూ.4వేలు, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. దళిత కుటుంబాలకు రూ.12వేలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పారిశుధ్యం పడకేసిందని,గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.