గజ్వేల్, ఏప్రిల్ 22: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో విలీనం చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు తలపెట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యంతో కార్మికులు జేఏసీగా ఏర్పాటై, తమ డిమాండ్లు అంగీకరించాలని కోరితే, 41 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి, ఏడాది నుంచి ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నదన్నారు. రాష్ట్రంలో 39వేల మంది కార్మికులు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సమ్మెకు దిగితే, పోలీసులతో ప్రైవేటు బస్సులు నడిపించేలా చూస్తున్నదన్నారు.
ప్రైవేటు బస్సులకు సంబంధించిన అగ్రిమెంట్లు రద్దు చేస్తామని భయందోళనకు గరిచేస్తూ బలవంతంగా నడిపించేలా ప్రభుత్వం ఒత్తిడితెచ్చిందన్నారు. బీఆర్ఎస్ తరఫున ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, పార్టీ పట్టణ అధ్యక్షుడు నవీజ్మీరా, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.