రామాయంపేట , డిసెంబర్ 14 : పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని, మున్సిపాలిటీలో ప్లాస్టిక్ ను సమూలంగా నిర్మూలించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం రామాయంపేటలో మున్సిపల్ అధికారులు, సిబ్బందితో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మున్సిపల్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా ఇండ్ల్లు, ఇతర నిర్మాణాలను చేపడితే కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకుని ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని, లేకుంటే జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రామాయంపేటలో ఆసంపూర్తిగా నిలిచిపోయిన ప్రభుత్వ పనులను తక్షణ మే రెండు నెలల్లో పూర్తి చేయించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పట్టణంలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. ఎక్కడ సమస్యలున్నా అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని కమిషనర్కు సూచించారు. పట్టణంలో అనుమతులు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హె చ్చరించారు.
రామాయంపేట మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చాలన్నారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తాను మున్సిపల్ అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించుకుంటున్నానని.. కొందరు అధికారులు అనుమతి లేదని తనను ఇబ్బందిపెడుతున్నట్లు అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. సమస్యలపై ప్రజలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కరిస్తా మని పేర్కొన్నారు. సమీక్ష అనంతరం అదనపు కలెక్టర్ నేరుగా వైకుంఠదామం పనులను పర్యవేక్షించారు. పనులు నత్తనడకన ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో వైకుంఠధామ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను హెచ్చరించారు. సమీక్షలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి, మేనేజర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు అనిల్, నాగరాజు, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది ప్రసాద్, ప్రసాద్, శంకర్, పద్మ, శ్రీనివాస్ ఉన్నారు.
ప్లాస్టిక్ను సమూలంగా తరిమేస్తాం
– మున్సిపల్ కమిషనర్ యాదగిరి
రామాయంపేట మున్సిపల్లో ప్లాస్టిక్ను సమూలంగా తరిమేస్తామని కమిషనర్ యాదగిరి పేర్కొన్నారు. పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంతోపాటు మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లి, గొల్పర్తి, కోమటిపల్లి, రామాయంపేట తం డాల్లో దాడులు నిర్వహించి, ఫ్లెక్సీలు లేకుండా చేస్తామన్నారు. రామాయంపేటను సిద్దిపేటగా మార్చుతామని, అందుకోసం పట్టణ ప్రజల సహకాకరించాలన్నారు. ప్లాస్టిక్ రహిత పట్టణ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.