రాయపోల్, జులై 10 : సాధారణంగా జన్మదిన వేడుకలు అంటే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. రాయపోల్ మండలం వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన జన్మదిన పురస్కరించుకొని విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు రూ. 27 వేల విలువ చేసే టీవీని బహుకరించారు.
ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులకు డిజిటల్ తరగతులు వినియోగానికి టీవీ చాలా ఉపయోగపడుతుందన్నారు. తన జన్మదినం పురస్కరించుకొని విద్యార్థులకు టీవీ బహుకరించడం ఎంతో సంతోషకరమన్నారు. అలాగే ఆయా గ్రామాల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వారికి విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాలకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలకు తన వంతుగా ఎంతో కొంత సాయం చేయాలన్నారు. కార్యక్రమంలో బేగంపేట, వడ్డేపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి, సుధాకర్ రెడ్డి, సీఆర్పీలు స్వామి, యాదగిరి, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.