మెదక్ మున్సిపాలిటీ, జనవరి 6: పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఏటా ‘ఇన్స్పైర్ మనక్’ పోటీలు నిర్వహిస్తోంది. 2022-23 సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. జాతీయస్థాయిలో ఉత్తమ ఆలోచనలను ఎంపిక చేసి విద్యార్థుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. జిల్లాస్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శన గత నవంబర్లో ఏర్పాటు చేయాల్సి ఉండగా.. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. సమయం లేకపోవడంతో ఈసారి ఆన్లైన్లో ప్రదర్శనలు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 18లోగా విద్యార్థులు ఆన్లైన్లో ప్రాజెక్టులు నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. ఈనెల 19 నుంచి 25 వరకు మూల్యంకనం చేస్తారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనభర్చిన వాటిలో జనవరి 26న రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రాజెక్టుల వివరాలు ప్రకటిస్తారు. 26 నుంచి 31 వరకు రాష్ట్రస్థాయి పోటీలకు యాప్లో వివరాలు నమోదు చేయాలి. ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు మూల్యాంకణం, అనంతరం జాతీయ స్థాయికి ఎంపికైన ప్రాజెక్టుల జాబితాను విడుదల చేస్తారు.
రూ.10 వేల చొప్పున ఖాతాల్లో జమ..
వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు ఏటా విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఉపాధ్యాయుల సహకారంతో నూతన ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు. గతేడాది ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 287 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. (మెదక్ జిల్లా నుంచి 45, సిద్దిపేట జిల్లా నుంచి 156, సంగారెడ్డి జిల్లా నుంచి 96) పరిశోధనకు అవసరాల నిమిత్తం రూ.10 వేల చొప్పున విద్యార్థుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
ఈనెల 18వతేదీ వరకు గడువు
ఇన్స్పైర్ మనక్ 2022-23 సంవత్సరానికి ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 18లోగా www.inspireawards.dst.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లక్ష్యం నెరవేరేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. సృజనాత్మకమైన ఆలోచనలు వాటి పరిష్కారాలను కనుగొనే దిశలో యోచించాలి. వినూత్న ఆలోచనలతో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటేందుకు ఉత్సాహంగా ముందుకు రావాలి. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే సంప్రదించాలి.
– రాజిరెడ్డి, మెదక్ జిల్లా సైన్స్ అధికారి
షెడ్యూల్ ఇలా..