మెదక్ మున్సిపాలిటీ, జూన్ 19: సర్కారు బడుల్లో కార్పొరేట్ విద్యను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన ప్రగతి సాధించింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుంది. విద్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన, వసతులు, మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ విద్యను అందించడంతోపాటు సన్న బియ్యంతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందిస్తుండడంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన కొద్దిరోజులకే అడ్మిషన్లు ఫుల్ అంటూ బోర్డులు పెడుతున్నారు. కేజీబీవీలు, గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, మైనార్టీ గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అలాగే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందజేస్తున్నారు. ఈ ఏడాది నుంచి స్కూళ్లల్లో రాగి జావ కూడా ఇవ్వనున్నారు.
నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ ప్రోత్సాహం
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గురుకులాలు, కస్తూర్బాలు, మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తోంది. సన్నబియ్యంతో రుచికరమైన భోజనం పెడుతోంది. క్రీడల్లో రాణించడానికి తగిన శిక్షణతోపాటు ఇతర అంశాల్లో సైతం ప్రోత్సాహం అందిస్తోంది. ఒక్కో విద్యార్థికీ ఏడాదికి రూ.1.25 లక్షలను ప్రభుత్వ ఖర్చు చేస్తుంది. ఉచితంగా పుస్తకాలు, నోట్ బుక్స్, కాస్మోటిక్ చార్జీలను సైతం ప్రభుత్వం కల్పిస్తుంది. వీటితోపాటు కరాటే, యోగా, చిత్రలేఖనం, వృత్తి విద్య కోర్సులను సైతం నేర్పిస్తుంది. కార్పొరేట్ స్థాయి విద్య అందుతుండడంతో గురుకుల పాఠశాలల్లో పోటీ పెరిగింది. పట్టణాలతోపాటు గ్రామాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.
12 రకాల మౌలిక వసతులు.. సదుపాయాలు
‘మనఊరు-మనబడి’ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో నీటి వసతితోకూడిన మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యం, అవసరమైన ఫర్నిచర్, పెయింటింగ్, పాఠశాలల మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీలు, వంటగది, ఆదనపు తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డ్రైనింగ్ హాళ్లు, డిజిటల్ విద్య అమలుకు అవసరమైన పాఠశాలల్లో చేపడుతున్నారు. అంతేగాకుండా 12 రకాల మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కార్పొరేట్స్థాయి పాఠశాలల భవనాలను తలదన్నేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు.
పది నుంచి ఇంటర్ వరకు అప్గ్రేడ్..
గతంలో కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో 6 నుంచి పదోతరగతి వరకు మాత్రమే చదువుకునే అవకాశం ఉండేది. తరువాత ఇంటర్ ఆపై చదువులకూ వాటిలోనే అవకాశం కల్పించింది. మెదక్ జిల్లాలో 15 కేజీబీవీ విద్యాలయాలు ఉండగా వాటిలో మెదక్, చేగుంట, నర్సాపూర్, అల్లాదుర్గం కేజీబీవీలను ప్రభుత్వం 2021-22 విద్యాసంవత్సరం నుంచి అప్గ్రేడ్ చేసింది. నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం కేజీబీవీలను అప్గ్రేడ్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇవేకాకుండా సాంఘిక సంక్షేమ గురుకులాలను సైతం ఇంటర్ వరకు ఆప్గ్రేడ్ చేశారు. 6వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఇంటర్ పూర్తయ్యే వరకు కార్పొరేట్ను తలదన్నే నాణ్యమైన విద్యనభ్యసిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో పౌష్టిక భోజనం, సాయంత్రం స్నాక్స్, వారానికి మూడుసార్లు మాంసం, గుడ్లు అందిస్తున్నారు. విద్యార్థినులకు 3 నెలలకు అవసరమయ్యే హెల్త్ కిట్స్ను కూడా విద్యాసంవత్సరంలో మూడు సార్లు అందిస్తారు. అలాగే ఈఏడాది నుంచి రాగిజావాను కూడా ఇవ్వనున్నారు.
మెదక్ జిల్లాలో 1,062 ప్రభుత్వ పాఠశాలలు
మెదక్ జిల్లాలో 1,062 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 636 ప్రాథమిక, 184 ప్రాథమికోన్నత, 242 ఉన్నత పాఠశాలలు, 15 కేజీబీవీలు, 7 మోడల్ స్కూళ్లు, 1 టీఆర్ఐఈఎస్, 1 అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్, 4 సోషల్ వెల్ఫేర్, 1 టీడబ్ల్యు(డిపార్ట్మెంట్) స్కూల్, 5 టీడబ్ల్యు(సొసైటీ) స్కూళ్లు, 7 బీసీ వెల్ఫేర్ పాఠశాలలు, 2 టీఎమ్ఆర్ఈఐ తదితర పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,27,706 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 16 ఉన్నాయి. వీటితోపాటు కస్తూర్బా, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబర్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కూడా నాలుగు ఉన్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలు 3 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో 6 నుంచి పదోతరగతి విద్యార్థులతోపాటు జూనియర్, డిగ్రీ విద్యార్థులకు ప్రతి ఒక విద్యార్థికీ ప్రతిఏటా రూ. 1.20 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇవేగాకుండా ఇంగ్ల్లిషు బోధనతోపాటు దుస్తులు, పుస్తకాలు ఉచితంగా ఇవ్వడంతో గురుకులాల్లో ప్రవేశాల సంఖ్య పెరిగింది.
‘మనఊరు-మనబడి’లో 313 పాఠశాలలు.. రూ. 130 కోట్ల నిధులు..
విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సర్కార్ బడులకు సకలహంగులు కల్పించి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా 2022లో ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో మెదక్ జిల్లాలోని సర్కారుబడుల పరిస్థితిపై విద్యాశాఖ సమగ్ర నివేదిక తయారుచేసి పంపింది. తొలి విడుతలో ప్రతి జిల్లాలో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని తొలి విడుతలో 313పాఠశాలలను ఎంపిక చేసి రూ.130 కోట్ల నిధులు మంజూరు చేసింది. తొలి విడుతలో ఎక్కువమంది(700 నుంచి వెయ్యి వరకు) విద్యార్థులు ఉండి సరైన వసతులు లేని పాఠశాలలను ఎంపిక చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించడంతోపాటు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మన ఊరు-మన బడి కింద ఆదివారం వరకు 18 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. మూడు పాఠశాలలను ఇప్పటికే ప్రారంభించారు. మిగతా 15 పాఠశాలలను ఈనెల 20న విద్యాదినోత్సవం రోజున ప్రారంభించనున్నారు. మిగతా పాఠశాలల్లో 80శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. త్వరలోనే పనులు పూర్తి చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యాదినోత్సవం రోజున పనులు పూర్తయితే15 పాఠశాలలు ప్రారంభించనున్నారు.