మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. సీఎం కేసీఆర్ రూ.వేలకోట్లు కేటాయిస్తుండడంతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జిల్లా కేంద్రం మెదక్లో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ భవనం, పోలీస్ క్వార్టర్స్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. 100 పడకలతో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రం తల్లీ బిడ్డలకు ఆరోగ్యభరోసానిస్తున్నది. రూ.50 కోట్లతో మిషన్ భగీరథ పూర్తి చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నది ప్రభుత్వం. ఘనపూర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ఆనకట్ట ఎత్తును పెంచేందుకు రూ. 43 కోట్లు కేటాయించగా, పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నియోజకవర్గంలో రూ.1167 కోట్లతో రోడ్ల మరమ్మతులు, బీటీ రెన్యువల్స్ చేపట్టడంతో ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి.మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి విస్తరణకు సర్కార్ రూ.1460.85 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. మెదక్-అక్కన్నపేట మధ్య 17కిలోమీటర్లు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేసి మెదక్ వాసుల దశాబ్దాల కలను బీఆర్ఎస్ సర్కార్ ఎట్టకేలకు నెరవేర్చింది. 25 రైతు వేదిక నిర్మించగా, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
మెదక్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్గా నిలుస్తున్నది. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేయడంతో పాటు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీరు, ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు.. వంటి పథకాలు ప్రజల దర చేరేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మెదక్ నియోజకవర్గంలో రోడ్లు జిగేల్ మంటున్నాయి. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రూ.400 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.462 కోట్లు, ఆర్అండ్బీ శాఖ రూ.305 కోట్లతో రోడ్ల మరమ్మతులు, బీటీ రెన్యువల్స్ తదితర పనులను పూర్తి చేశారు. గిరిజన ప్రాంతాల రోడ్లతో పాటు పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు మహర్దశ పట్టింది. గిరిజన ప్రాంతాల రోడ్లకు రూ.44 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్లకు రూ.20 కోట్లు, మరో రూ.10 కోట్లు మరమ్మతులు, ఇంకో రూ.10 కోట్లు బీటీ రెన్యువల్స్కు, వీటితో పాటు ఆర్అండ్బీ రోడ్లకు రూ.24 కోట్లు మంజూరయ్యాయి. ఇదిలావుండగా, మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి 765 డీజీ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. మెదక్-సిద్దిపేట ఒక బిట్టుగా, సిద్దిపేట -ఎల్కతుర్తి వరకు రెండో బిట్టుగా రహదారిని విభజించారు. సిద్దిపేట – ఎల్కతుర్తి 63.641 కిలోమీటర్ల రహదారికి రూ.578.85 కోట్లు, మెదక్ నుంచి సిద్దిపేట వరకు రహదారి విస్తరణకు 70 కిలోమీటర్లగాను రూ.882 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
సీఎం కేసీఆర్ మానస పుత్రిక మిషన్ భగీరథ పథకాన్ని జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో చేపట్టారు. మెదక్ మున్సిపాలిటీలో సుమారు 70వేల జనాభా ఉండగా, 32 వార్డులకు ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నది. నియోజవర్గంలోని అన్ని మండలాల్లో మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మిస్తూ, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ సౌకర్యం కల్పించింది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో 24 గంటలు తాగునీటిని సర్కార్ అందిస్తున్నది. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో ఇంటింటికీ తాగునీరు అందజేస్తూ నీటి కోసం మహిళలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వం మెదక్ నియోజకవర్గంలో 25 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. ఇక్కడ రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు వ్యవసాయ శాఖ అధికారులు ఇస్తున్నారు. ప్రతి ఐదు ఎకరాలకు ఒక క్లస్టర్గా విభజించి రైతు వేదికలు నిర్మించారు. ఇందుకోసం ఎన్ఆర్ఈజీఎస్ నిధులను వినియోగించారు. 24 గంటల పాటు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి
రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు.
మెదక్ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ మెదక్ రైల్వే స్టేషన్ను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. రైల్వేలైన్ నిర్మాణానికి తన వాటాగా రూ.85.75 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి ప్రభుత్వాలు రైల్వేలైన్ కోసం శంకుస్థాపన చేసి వదిలిపెట్టగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్-అక్కన్నపేట రైల్వేస్టేషన్కు 17 కిలోమీటర్ల మేర నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేసింది. రైల్వేలైన్ కోసం 900 మంది రైతులు 370 ఎకరాల భూములను ఇవ్వగా, భూ సేకరణ కోసం ప్రభుత్వం రూ.16.84 కోట్లు నష్టపరిహారం అందించింది. మెదక్-అక్కన్నపేట మార్గంలో మూడు స్టేషన్లు ఉండగా, రామాయంపేట మండలం లక్ష్మాపూర్, హవేళీఘణపూర్ మండలంలోని శమ్నాపూర్తో పాటు జిల్లా కేంద్రం మెదక్లో రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిల సహకారంతో మెదక్-అక్కన్నపేట రైల్వేస్టేషన్ రూపుదిద్దుకున్నది. దీంతో, మెతుకు సీమ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మెదక్ రైల్వే స్టేషన్ పనులకు సంబంధించి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఎప్పటికప్పుడు రైల్వే శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి రైల్వే పనులు త్వరగా పూర్తి చేయించి మెదక్ వాసులకు రైలు ప్రయాణం అందుబాటులోకి తెచ్చారు.
మెదక్ నియోజకవర్గంలోని కొల్చారం-ఏడుపాయల మధ్య ఉన్న ఘన్పూర్ ఆనకట్ట ఎత్తు పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.43 కోట్లు కేటాయించింది. దీంతో, ఆనకట్ట ఎత్తు పెంపు పనులు చురుగ్గా కొనసాగుతుండగా, రూ.50 కోట్ల నిధులతో అధికారులు కాలువలు, సిమెంట్ లైనింగ్ పనులు పూర్తి చేశారు. మంజీరా నదిపై ఎక్కడా లేని విధంగా చెక్డ్యాంలను నిర్మిస్తుండడంతో ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతోంది. ముఖ్యంగా ప్రతి గ్రామంలో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడంతో మెదక్ నియోజకవర్గంలో జలసిరులు కురుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ మెదక్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రూపురేఖలు మారిపోయాయి. మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత మెదక్లోనే నూతన కలెక్టరేట్ సమీకృతం భవనం, ఎస్పీ కార్యాలయం, 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటయ్యాయి. మెదక్ నియోజకవర్గంలో మెదక్ మున్సిపాలిటీ, రామాయంపేట మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టణాలతో పాటు గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం వేయడంతో నివాస ప్రాంతాలు దుర్గంధభరితంగా ఉండేవి. రోడ్లకు ఏండ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పట్టణాలతో పాటు పల్లెలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో అన్ని సమస్యలు పరిష్కారమై నేడు సరికొత్తగా దర్శనమిస్తున్నాయి.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా. వివిధ పనుల కోసం సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలు మంజూరు చేశారు. జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో మిషన్ భగీరథ మంచినీటిని సరఫరా చేస్తున్నాం. జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయంతో పాటు ఎంసీహెచ్ను మంజూరు చేయించాను. నియోజకవర్గంలో రూ.1167 కోట్లతో రోడ్ల అభివృద్ధికి నిధులు తెప్పించాను. ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపునకు సీఎం కేసీఆర్ రూ.43 కోట్లు నిధులు కేటాయించారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
– ఎం. పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్