‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే ట్యాగ్లైన్తోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ 150కి పైగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. 90కి పైగా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. దీంతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎంతోమంది పేద యువకులు ఉద్యోగాలు సాధించి వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. ఇటీవల కొంతమంది పేపర్ లీకేజీ చేసి టీఎస్పీఎస్సీకి అప్రతిష్ట తెచ్చారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఓర్వలేని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రతీది రాజకీయ చేయాలని చూస్తుండడం దురదృష్టకరమని ఉద్యోగార్థులు సైతం మండిపడుతున్నారు. ఉద్యోగార్థుల ప్రిపరేషన్ కోసం ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రంథాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లు, గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచింది. వీటిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుంటున్నది.
సిద్దిపేట, మార్చి 19( నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఎంతో మంది కష్టపడి ఉద్యోగాలు సాధించారు. ఓర్వలేని ప్రతి పక్ష పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ప్రతి పరీక్షను టీఎస్పీఎస్సీ పకడ్బందీగా నిర్వహిస్తుంది. నియమ నిబద్ధతతో పనిచేస్తున్న టీఎస్పీఎస్సీకి పేపర్ లీకేజీ కొంత మంది అప్రతిష్ట తెచ్చారు. మొన్న జరిగిన పేపర్ లీకేజీ చాలా దురదృష్టకరమని ఉద్యోగార్థులు చెబుతున్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రతీది రాజకీయం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు వేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించింది. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసిన విషయం ప్రతి పక్షపార్టీల నాయకులు, ఇవాళ రాజకీయాలు చేసే వారు మర్చిపోయినట్లు ఉన్నారు. గతంలో ఒక్క ఉద్యోగం కూడా నింపని వారు నేడు రాస్తారోకోలు, ధర్నాలతో రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. ఏదో కారణంతో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని టీఎస్పీఎస్సీకి ఆపాదించడం ఎంత వరకు కరెక్ట్ అని ఉద్యోగార్థులు మండిపడుతున్నారు .
తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్లైన్తోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 150కి పైగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. 90కి పైగా పరీక్షలు నిర్వహించి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. దీంతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎంతో మంది వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా ఇవ్వాళ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలతో సంతృప్తి చెందుతున్నారు. ఇవి వాస్తవాలు కాదా..? ప్రతి పక్ష పార్టీలు ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని మేధావులు, నిరుద్యోగ యువత సూచిసున్నది. వ్యవస్థ అన్నప్పుడు కొన్ని తప్పిదాలు జరుగుతాయి..అంత మాత్రాన పూర్తిగా వ్యవస్థను తప్పుపట్టడం సమంజసం కాదు అని వారు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేపర్ లీకేజీని సీరియస్గా తీసుకొని కఠిన చర్యలకు సిద్ధం కావడంతో పాటు బాధ్యులు ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఉద్యోగార్థులకు ఎక్కడా అన్యాయం జరుగవద్దని వారి కోచింగ్, ఇతరత్రా బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. గతంలో దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాసిన వారంతా మళ్లీ పరీక్షలకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. వారు మరో సారి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉంచింది. జిల్లాలోని అన్ని స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేయడంతో పాటు 24 గంటలు తెరిచి ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. భోజన వసతి కల్పిస్తున్నారు.
అందుబాటులో గ్రంథాలయాలు, స్టడీ సర్కిళ్లు
ఉద్యోగార్థుల ప్రిపరేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రంథాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని బీసీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లు, గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచారు. వీటిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ఎస్టీ,ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా సైతం శిక్షణ ఇస్తారు. ప్రతి గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు కావాల్సిన స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి నిరుద్యోగి అన్ని రకాల పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. సిద్దిపేట జిల్లా గ్రంథాలయంతో పాటు, బీసీ,స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. సిద్దిపేట జిల్లా గ్రంథాలయం, 16 శాఖా గ్రంథాలయాలు, 4 గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటన్నింటిలో సుమారు 1,84,424 లక్షల పుస్తకాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో గ్రేడ్ వన్ గ్రంథాలయంతో పాటు 19 శాఖ, 12 మినీ గ్రంథాలయాలు ఉన్నాయి. ప్రభుత్వం స్టడీ సర్కిల్ ద్వారా అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతుంది. మెదక్ జిల్లాలో 18 గ్రంథాలయాలు ఉండగా వీటిలో 14 శాఖా గ్రంథాలయాలు, 4 మినీ గ్రంథాలయాలు ఉన్నాయి. శిక్షణ తరగతులను సైతం ఏర్పాటు చేశారు.
కష్టపడేవారికి తప్పకుండా ఫలితం దక్కుతుంది
కొల్చారం, మార్చి 19 : నాపేరు గడీల రేణుక, మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. కొల్చారం మండల ఎనగండ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004 ఎస్ఎస్సీ బ్యాచ్. మెదక్లోని శ్రీనివాస జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివా. జోగిపేటలోని నెహ్రూ మెమోరియల్ కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్శిటీలోని యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ సైన్స్లో పీజీ చేశారు. మెదక్లోని సీఎస్ఐ కాలేజీలో బీఎడ్ పూర్తి చేశారు. 2016 డిసెంబర్లో రామయ్య కోచింగ్ సెంటర్లో సుమారు 40 రోజుల పాటు క్లాసులకు హాజరయ్యా. అక్కడి పెట్టిన ప్రాక్టీస్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించిన టీఆర్టీ 2017 బయాలాజీ పరీక్షను మార్చి 4న నిర్వహించారు. అందులో 71.8 మార్కులతో జిల్లా స్థాయిలో ద్వితీయ ర్యాంకును సాధించా. స్కూల్ అసిస్టెంట్గా ఎంపికయ్యాను. నా ఎంపిక కోసం నా కుటుంబం ఎంతో సహకారం అందించారు. ప్రస్తుతం కౌడిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలాజీ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నా. కష్టపడేవారికి తప్పకుండా ఫలితం దక్కుతుందనడానికి నాకు వచ్చిన ఉద్యోగమే నిదర్శనం. ఎలాం టి అపోహలకు తావివ్వకుండా కష్టపడి చద వాలి.
– గడీల రేణుక, బయాలాజీ టీచర్(కొల్లారం)
పారదర్శకంగా నియామకాలు
రాయికోడ్, మార్చి 19 : టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటి వరకు నియామకాలు చాలా పారదర్శకంగా జరిగాయి. నేను 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరాను. పేద కుటుంబం నుంచి వచ్చిన పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించా. టీఎస్పీఎస్సీ చాలా పారదర్శకంగా నియామకాలు చేసినందుకే నాలాంటి నిరుపేద కుటుంబాల్లో సైతం ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు. ఎవరో ఇద్దరు చేసిన తప్పునకు టీఎస్పీఎస్సీని తప్పు పట్టడం సరికాదు. ఉద్యోగార్థులు ఎవరూ ఏమి చెప్పినా తప్పుడు సమాచారాన్ని నమ్మకండి, కష్టపడి చదివి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలు సాధించండి.
– ఈ.రాములు, కుస్నూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి
పరీక్షలు పకడ్బందీగా జరిగాయి..
నర్సాపూర్,మార్చి19 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో మొదటి సారిగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. గ్రూప్-4లో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేశాను. అప్పటికే నేను వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ అటెండర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తునే పరీక్షకు సిద్ధమయ్యాను. పాఠశాల విద్యార్థుల నుంచి సేకరించిన పుస్తకాలతో పాటు కాంపిటీషన్ బుక్స్ చదివాను. 2017లో మేడ్చల్ సమీపంలోని కిష్టాపూర్ దగ్గర మల్లారెడ్డి కళాశాలలో ఎగ్జామ్ సెంటర్ పడింది. పరీక్ష నిర్వహణ కట్టుదిట్టంగా జరిగింది. మొత్తానికి ఎగ్జామ్స్ విజయవంతంగా రాయగలిగాను. 2018లో ఫలితాలు రాగా, 2019వ సంవత్సరంలో ఉద్యోగానికి ఎంపికైనట్టు కాల్ లెటర్ వచ్చింది. పేపర్ లీకేజీ లాంటి సమస్యలు మాకు ఎదురుకాలేదు. ఉద్యోగం వచ్చిందని సంతోషించే లోపే మాకు చేదు వార్త తెలిసింది. ఒక సంవత్సరం పాటు శిక్షణ పొందితేనే ఉద్యోగానికి అర్హులని రూల్ వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్షణకు వెళ్లాను. శిక్షణా తరగతుల్లో కూడా చాలా నిబంధనలు పెట్టారు. పరీక్షలు, ఫీల్డ్ వర్క్, ప్రాక్టికల్స్, థియరీ ఎగ్జామ్స్ వాటిని నిర్వహించి నన్ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దారు. ఈ శిక్షణ తరగతులు సక్రమంగా పూర్తి చేస్తేనే ఉద్యోగం ఇస్తామని అధికారులు అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు. అప్పట్లో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కట్టుదిట్టంగా నిర్వహిస్తే, నేడు పేపర్ లీకేజీ జరిగిందంటూ వార్తలు రావడం నమ్మలేక పోతున్నాను. మొత్తానికి తెలంగాణ ప్రభు త్వం ఇచ్చిన అవకాశంతో ఉద్యోగం సాధిం చి సంతోషంగా ఉన్నాను.
– చెన్నయ్య, వెటర్నరీ అసిస్టెంట్, నర్సాపూర్
ప్రణాళికా బద్ధంగా చదవాలి
ఆత్మవిశ్వాసంతో ప్రణాళికా బద్ధంగా చదివితే ఉద్యోగం సాధించడం తేలికవుతుంది.తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ప్రభుత్వం 2018లో నిర్వహించిన పోటీ పరీక్షల్లో పంచాయతీ సెక్రటరీ, అటవీశాఖల్లో ఉద్యోగాలు సాధించా. 2020లో నిర్వహించిన పరీక్షలోహాస్టల్ వార్డెన్ ఉద్యోగం సంపాదించా. పోటీ పరీక్షలు రాసేటప్పుడు తెలుగు అకాడమీ అందించిన మెటీరియల్ చదవడం ఉత్తమం. నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి.
– పోశాద్రి యాదవ్, హాస్టల్ వార్డెన్, సిద్దిపేట
ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు..
గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు. టీఎస్పీఎస్సీ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. అందులో కొందరు వ్యక్తులు చేసిన తప్పుని ప్రభుత్వానికి ఆపాదించడం పద్ధతి కాదు. అక్కడ జరిగిన అవకతవకలకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఆ సంస్థలో అధికారుల నిర్లక్ష్యం, కింది స్థాయి సిబ్బంది చేసిన తప్పులే గ్రూప్-1పేపర్ లీకేజీకి కారణం. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురద జల్లడం రాజకీయ దురుద్దేశమే అవుతుంది. గతంలో టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు, రిక్రూట్మెంట్లు పారదర్శకంగానే జరిగాయి. ప్రస్తుతం ఎవరో ఒకరిద్దరు చేసిన ఈ దుశ్చర్యకు గ్రూప్-1 అభ్యర్థులు బాధపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీఎస్పీఎస్సీపై ప్రభుత్వం పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
– శ్రీనివాస్రాథోడ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆర్సీపురం
నిరుద్యోగులు నిరుత్సాహానికి గురికావద్దు
ఎన్నో ఏండ్ల నిరీక్షణ ఫలితమే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం. నాలుగైదు ఏండ్లపాటు చిరుద్యోగాలు చేస్తూ, కష్టపడి చదువుకున్నాను. నోటిఫికేషన్లు వచ్చిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాను. 2018లో గ్రూపు-4 నోటిఫికేషన్లో అర్హత సాధించి 2020లో ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం తూప్రాన్ ఏరియా ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్నాను. గతేడాది నిర్వహించిన గ్రూపు-1పరీక్షల్లోనూ అర్హత పొందాను. కానీ, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో మళ్లీ పరీక్షలు రాయాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలతో నిరుద్యోగులు నిరుత్సాహానికి గురికావద్దు. చాలా సమయం ఉంటుంది, కాబట్టి మరింత మెరుగ్గా కష్టపడి చదవాలి. పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
– ఏదుల విజయ్కుమార్, జూనియర్ అసిస్టెంట్, వెల్దుర్తి
పట్టుదలతో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపిక
మాది నిరుపేద కుంటుంబం. నా తల్లిదండ్రులు తుల్జయ్య, శ్యామలమ్మ ఎన్నో కష్టాలకోర్చి నన్ను బీ ఫార్మసీ వరకు చదివించారు. నాలుగు సంవత్సరాల క్రితం నేను ఫార్మసీ చదువుతున్నప్పుడే టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. నేను వెంటనే పరీక్షల కోసం కోచింగ్ తీసుకున్నాను. బాగా చదవి పరీక్ష రాశాను. పంచాయతీ కార్యదర్శిగా అర్హత సాధించాను. పైరవీలు, ఖర్చు లేకుండా నాకు ఉద్యోగం వచ్చింది. ప్రస్తు తం కోహీర్ మండలం ఏడాకులపల్లిలో విధులు నిర్వహిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– కృష్ణ, పంచాయతీ కార్యదర్శి, కోహీర్
గజ్వేల్, మార్చి19: నా పేరు తిగుళ్ల నాగేందర్రెడ్డి, మాది రైతు కుటుంబం. మా నాన్న అంజిరెడ్డి గజ్వేల్లో మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. వ్యవసాయ కుటుంబం కావడంతో నాకు వ్యవసాయ విద్యపైనే ఆసక్తి కలిగింది. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, ఎం ఎస్సీ అగ్రికల్చర్ చేశా. పీహెచ్డీ రెండో సంవత్సరం చేస్తున్నప్పుడు (తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత) 2016లో టీఎస్పీఎస్సీ ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ (గ్రూ ప్ -1 బి) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నేను దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసి పాసయ్యాను. 2016లో పరీక్షలు నిర్వహించి 2017లో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఎంపికై ఉద్యోగాన్ని సాధించా.
మొద ట నిజామాబాద్లో మండల వ్యవసాయాధికారిగా విధులు నిర్వహించా. ప్రస్తుతం మర్కూ క్ మండల వ్యవసాయాధికారిగా విధులు నిర్వహిస్తున్నా. టీఎస్పీఎస్సీ ఉన్నత ఆశయాలతో పటిష్టంగా నిర్వహిస్తున్న వ్యవస్థ. దీనిలో ఎలాంటి పైరవీలకు తావులేదు. మా బ్యాచ్లో అందరూ ఎంతో శ్రమించి బాగా చదివి పరీక్షలు రాశారు. నేను పోటీ పరీక్షలకు ఎక్కువగా ప్రిపేర్ కావడంతో పాటునా చదువుకూడా యూనివర్సిటీలోనే కొనసాగడంతో పరీక్ష తేలికైంది. ప్రస్తుతం యువత స్వశక్తిపైనే ఆధారపడుతున్నారు. ప్రభుత్వం కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తున్నారు. మమ్ముల్ని ఆదర్శంగా తీసుకుని మా ప్రాంతం వారు ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా కష్టపడుతున్నారు. అప్పటి టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి నుంచి నేటి వరకు పరీక్షలను పటిష్టంగా నిర్వహించడమే కాకుండా పరీక్షల సిలబస్తోపాటు నియామకాల్లోనూ జవాబుదారీగా వ్యవహరించారు. ఎవరో ఒకరు అవినీతికి పాల్పడితే దానికి సంస్థను దోషిగా ఎత్తిచూపడం సరైన పద్ధతి కాదు. వ్యక్తి తప్పిదం వ్యవస్థకు ఆపాదించడం సహించరానిది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో టీఎస్పీఎస్సీ పోషిస్తున్న పాత్ర ఎంతో గొప్పది.
అక్కన్నపేట, మార్చి 19 : మారుమూల గిరిజనతండా…పాతకాలం నాటి పెంకుటిల్లు..మూడు ఎకరాల వ్యవసాయ భూమి..కూలీనాలీ చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి..మొత్తంగా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబ నేపథ్యం…అలాంటి పేద గిరిజన కుటుంబానికి సర్కారు కొలువు వరించింది. విద్యుత్శాఖలో జేఎల్ఎం(జూనియర్ లైన్మెన్)గా ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబానికి పెద్ద దిక్కు అయిండు నిరుపేద గిరిజన యువకుడు.
బోదర్వాగు తండాకు…
మండలంలోని అక్కన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని బోదర్వాగుతండాకు చెందిన భూక్యా పుల్సింగ్-బుజ్జి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. ఉన్న మూడు ఎకరాల భూమి సాగుచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఉన్నంతలో ముగ్గురు బిడ్డల పెండ్లి చేశారు. ముగ్గురు ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి. కేసీఆర్ కిట్టు వచ్చింది. కుమారుడు శ్రీకాంత్ పదో తరగతి వరకు హుస్నాబాద్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదివాడు. తర్వాత ఐటీఐ (ఎలక్ట్రీషిన్) చేశాడు. ప్రభుత్వం ద్వారా విద్యుత్శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. శ్రీకాంత్ ఎస్టీ క్యాటగిరీలో జేఎల్ఎంగా ఉద్యోగం సాధించాడు. 2019 సెప్టెంబర్లో ఉద్యోగంలో చేరి ప్రస్తుతం జగిత్యాల జిల్లా చిల్వకొడూర్లో జేఎల్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ
ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేసింది. ఐటీఐ చేసిన తర్వాత విద్యుత్శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఎస్టీ రిజర్వేషన్లో మెరిట్ ఆధారంగా జేఎల్ఎం ఉద్యోగానికి ఎంపికయ్యా. ఉద్యోగాల భర్తీ అనేది అంతా పారదర్శకంగా ఉంటుంది. ఉద్యోగంతోనే మా కుటుంబం నిలబడింది. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి.
– శ్రీకాంత్ , బోదర్వాగు తండా, అక్కన్నపేట మండలం