తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది. తాజాగా గ్రూప్ -4ను విడుదల చేసింది. దీని ద్వారా 9,168 పోస్టులను భర్తీ చేయనున్నది. ఎన్నో ఆశలతో సన్నద్ధమవుతున్న యువతీయువకుల్లో ఇప్పుడు నయా జోష్ నిండింది. వివిధ శాఖల్లో 9,168 ఉద్యోగాలు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగార్థుల్లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. ఈనెల 23 నుంచి జనవరి 12వరకు దరఖాస్తుల సమర్పణ జాతర కొనసాగనుండగా, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని గ్రంథాలయాలు ఉద్యోగార్థులతో సందడిగా మారాయి. జిల్లాలోని బీసీ, ఎస్టీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు, గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచగా, వీటిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుంటున్నది. ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి యువలోకం కృతజ్ఞతలు తెలుపుతున్నది. కాగా, త్వరలోనే ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ రానున్నది.
– సిద్దిపేట, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ నిండు శాసనసభలో చెప్పిన విధంగా లక్ష ఉద్యోగాల భర్తీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. భారీ సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది. తాజాగా గ్రూప్ -4ను విడుదల చేసింది. దీని ద్వారా 9,168 పోస్టులను భర్తీ చేయనున్నది. త్వరలోనే ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ రానున్నది. ఉద్యోగార్థులు ప్రిపేరేషన్లో నిమగ్నమవుతున్నారు. దీంతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని గ్రంథాలయాలు ఉద్యోగార్థులతో సందడిగా మారాయి. ఇప్పటికే కేసీఆర్ ఉచిత కోచింగ్ కేంద్రాల ద్వారా పోలీస్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణను ఇప్పించారు. తాజాగా గ్రూప్ -4 నోటిఫికేషన్ రావడంతో మళ్లీ కేసీఆర్ ఉచిత శిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సిద్దిపేటలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఉద్యోగార్థుల కోసం కేసీఆర్ ఉచిత శిక్షణ కేంద్రం ద్వారా శిక్షణ తరగతులను త్వరలోనే ప్రారంభించనున్నారు. జిల్లాలోని బీసీ, ఎస్టీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు, గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. వీటిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుంటున్నది. వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంతో అంతా ప్రిపరేషన్లో లీనమవుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఒక్కరి కల. సర్కారు నౌకరీ సాధించాలనే కోరిక. ఆ దిశగా శ్రమించాలి. కొలువు సాధించాలి.. అనే పట్టుదల, కసి ఉండాలి. ఆ లక్ష్యం వైపు యువత అడుగులు వేస్తే భవిష్యత్లో మంచి ఉన్నత స్థానాల్లో ఉంటారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయడంతో జిల్లాలోని గ్రంథాలయాల్లో సందడి నెలకొంది. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా సైతం శిక్షణనిస్తారు. ప్రతి గ్రంథాలయంలో వివిధ కాంపిటీటివ్ పరీక్షలకు కావాల్సిన స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి నిరుపేద నిరుద్యోగికి అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. సిద్దిపేట జిల్లా గ్రంథాలయంతో పాటు, బీసీ,స్టడీ సర్కిళ్లున్నాయి. సిద్దిపేట జిల్లా గ్రంథాలయం, 16 శాఖ గ్రంథాలయాలు, 4 గ్రామీణ గ్రంథాలయాలున్నాయి. వీటన్నింటిలో కలిపి సుమారుగా 1,84,424 పుస్తకాలు అన్ని భాషల్లో అందుబాటులో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో గ్రేడ్-1 గ్రంథాలయంతో పాటు 19 శాఖ, 12 మినీ గ్రంథాలయాలున్నాయి. ఇక ప్రభుత్వం స్టడీ సర్కిళ్ల ద్వారా అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నది. మెదక్ జిల్లాలో 18 గ్రంథాలయాలుండగా, వీటిలో 14 శాఖ గ్రంథాలయాలు, 4 మినీ గ్రంథాలయాలున్నాయి. అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నేతృత్వంలో వివిధ పరీక్షల అభ్యర్థుల కోసం శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన తరహాలోనే మళ్లీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గ కేంద్రంలో ఈ శిక్షణ తరగతులను మంచి ప్రావీణ్యం ఉన్న వారితో ఏర్పాటు చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించి, దీంట్లో ఎంపికైన వారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణను ఇస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున కొలువులను నింపుతుండడంతో అభ్యర్థులంతా ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు. అందుబాటులో ఉన్న గ్రంథాలయాలు, ఇతర కోచింగ్ సెంటర్లకు పయాణమవుతున్నారు. మరి కొంత మంది కాంపిటీటివ్ పుస్తకాలను తెచ్చుకొని, గ్రూప్గా చదువుతున్నారు. తాజాగా గ్రూప్-4 నోటిఫికేషన్ రావడంతో అంతా ప్రిపరేషన్లో లీనమవుతున్నారు. ఇప్పటి కే పలు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడమే గాక, పోస్టులను కూడా భర్తీ చేసింది. త్వరలోనే టీచర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ రానున్నది. దీంతో ప్రతి ఒక్కరు ఉద్యోగం సాధించాలనే కసితో చదువుతున్నారు. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్ హాయిగా ఉంటుంది. కాగా, స్థానిక అభ్యర్థులు తమ సొంత జిల్లా, జోన్, మల్టీ జోన్లలో 95శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో 5శాతం ఓపెన్ కోటాలో ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం ఉంది. కొత్త జోనల్ వ్యవస్థ విధానంతో పాత వ్యవస్థ పూర్తిగా రైద్దెంది. ఇన్నాళ్లు ఉన్న జోనల్ వ్యవస్థ ద్వారా జిల్లా నుంచి రాష్ట్రస్థాయి కేడర్ వరకు స్థానికేతురులు భారీగా పోస్టులు తన్నుకొని పోయేవారు. కొత్త విధానం ద్వారా ఈ వ్యవస్థ పూర్తిగా మారిపోయి స్థానికులకు ప్రయోజనం కలుగుతుంది. జిల్లా, జోనల్, బహుళ జోన్ పరిధిలో జరిగే ప్రత్యక్ష నియామకాల్లో 95శాతం పోస్టులు స్థానికులకే దక్కుతాయి. ఆ లెక్కన గతంలో జరిగిన భర్తీ విధానంతో పోల్చి చూస్తే జిల్లా స్థాయి పోస్టుల్లో అదనంగా పదిహేను శాతం పోస్టులు స్థానికులకు దక్కతాయి. అలాగే, జోనల్ కేడర్లో 25శాతం, బహుళ జోన్ పరిధిలో 35శాతం పోస్టులు స్థానికులకు దక్కనున్నాయి. జిల్లా, జోనల్, బహుళ జోన్ పరిధిలో కేవలం 5శాతం మాత్రమే స్థానికేతర రిజర్వేషన్లుంటాయి. ఇందులోనూ మన స్థానికులు పోటీ పడవచ్చు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్లు వరుసగా వస్తున్నాయి. ఉద్యోగాల వారీగా విద్యార్హతలను, వయోపరిమితి, సిలబస్ తదితర వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల పరంపరను సీఎం కేసీఆర్ సార్ కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ఉద్యోగాలతో మాలాంటి పేద కుటుంబాలకు ఎన్నో ఉద్యోగాలు లభించనున్నాయి. వరుసగా ఉద్యోగాల ప్రకటనలు వేస్తూ పల్లెల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞలు.
– కాస ప్రకాశ్, కాంట్రాక్టు హిందీ టీచర్, మిరుదొడ్డి గురుకుల పాఠశాల
తెలంగాణ ప్రభుత్వం 9,168 గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగుల పాలిట వరం. ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎదురుచూస్తున్న నాలాంటి యువత ఈ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్ను సద్వినియోగం చేసుకోవాలి. ఖాళీలను గుర్తించి, నోటిఫికేషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– కొడిసెల రాజు, పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థి, కిష్టంపేట, కొమురవెల్లి