తెలంగాణపై కేంద్రం వివక్ష..
రైతులపై మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది
బీజేపీ రాష్ట్ర నేతలు తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలి
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్
సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట మహాధర్నా
హాజరైన ఎమ్మెల్యేలు, జడ్పీచైర్పర్సన్ మంజూశ్రీరెడ్డి,
టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, రైతులు
బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని రైతులకు పిలుపు
రైతులు కల్లాలు నిర్మించుకుంటే తప్పా..?
‘తెలంగాణపై వివక్ష చూపిస్తున్న మోదీ సర్కారుపై గళమెత్తినం.. ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే’ అని బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తాలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన జడ్పీచైర్పర్సన్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్, ఎమ్మెల్యేలు, నాయకులు, రైతులు మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనకుండా ఇబ్బంది పెట్టడంతో పాటు కల్లాలు నిర్మించేందుకు ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని నోటీసులు జారీచేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. రైతు దినోత్సవం రోజున రైతులతో ధర్నా చేయించారని, అన్నదాతలను ఇబ్బందిపెడితే పుట్టగతులుండవని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కారు’ అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ అదానీ, అంబానీలాంటి బడాబాబులకు కొమ్ముకాస్తున్న బీజేపీకి బుద్ధిచెప్పాలని రైతులు, ప్రజలకు పిలుపునిచ్చారు.
సంగారెడ్డి డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ)ః ఉపాధి హామీ పథకంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం సంగారెడ్డిలో రైతు మహాధర్నా నిర్వహించింది. కల్లాల నిధులు రూ.150 కోట్లు వాపస్ ఇవ్వాలంటూ కేంద్రం నోటీసు ఇవ్వడాన్ని నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, నాయకులు, రైతులు సంగారెడ్డిలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ధర్నాలో జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్రావు, భూపాల్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్చైర్మన్ మాణిక్యం, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ధర్నాకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణపై విషం చిమ్ముతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం ఈజీఎస్ నిధులతో కల్లాలు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు వాపస్ ఇవ్వాలని అడగడం దారుణమన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నదన్నారు. రైతుల బోరుబావుల వద్ద మీటర్లు పెట్టాలని కేంద్రం చెబుతున్నదన్నారు. బీజేపీకి రైతులు, ప్రజలు తగిన బుద్దిచెబుతారని హెచ్చరించారు. జడ్పీ చైర్పర్సన్ మంజూ శ్రీజైపాల్రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ రైతులను చిన్నచూపు చూస్తున్నదన్నారు. గతంలో వడ్లు కొనుగోలు చేయని కేంద్రం ఇప్పుడు కల్లాల డబ్బులు వాపస్ ఇవ్వమనడం కక్ష సాధించడమే అన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్రానికి ప్రజలు, రైతులు బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు.
సంగారెడ్డి మహాధర్నాలో మాట్లాడుతున్న టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, చిత్రంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
బీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలి
జాతీయ రైతు దినోత్సవం రోజున రైతులు ధర్నా చేసేలా చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ రైతులకు పిలుపునిచ్చారు. ధర్నాలో మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పింఛన్లు, సులభంగా రుణాలు ఇస్తామన్న మోదీ అధికారంలోకి వచ్చాక వారి ఉసురుతీసుకుంటున్నారని మండిపడ్డారు. ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మించిన కల్లాల నిధులు తిరిగి ఇవ్వమనటం సిగ్గుచేటన్నారు. కల్లాలపై కేంద్రం జారీ చేసిన నోటీసులను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీ నాయకులను రైతులు ఎక్కడికక్కడ నిలదీయాలని, గ్రామాలకు వస్తే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు రైతులు అండగా నిలవాలని కోరారు.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. కేంద్రం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, బీజేపీకి రైతులు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ మోదీ సర్కార్ తెలంగాణ, రైతుల పట్ల చిన్నచూపు చూస్తున్నదన్నారు. రాష్ర్టానికి రావాల్సిన ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు, రైల్వేకోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వకపోగా, ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడుతున్నదన్నారు. తెలంగాణ రైతుల జోలికి వస్తే సీఎం కేసీఆర్ బీజేపీ పార్టీని బొందపెట్టడం ఖాయమని హెచ్చరించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ రైతులను పట్ల కేంద్రంలోని బీజేపీ తీరు సరికాదన్నారు. కల్లాల నిధులు వాపస్ ఇవ్వాలని కోరడం దుర్మార్గమైన చర్య అన్నారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు నష్టం జరగకుండా చూస్తారని, అలాగే కేంద్రంలోని బీజేపీకి గట్టి బుద్దిచెబుతారని తెలిపారు. టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు దినోత్సవం రోజు రైతులు ధర్నా చేసేలా చేసిన బీజేపీ సిగ్గుపడాలన్నారు. కల్లాల నిధులు వెనక్కి ఇవ్వమనడం తెలంగాణపై వివక్ష చూపడమేనని అన్నారు. వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే వెంటనే ఢిల్లీ వెళ్లి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావాలని, కల్లాలపై వచ్చిన నోటీసులను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.