గజ్వేల్, సెప్టెంబర్ 1: గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్అండ్బీ రోడ్లపై ప్రయాణం సాఫీగా ముందుకుసాగుతున్నది. గత తొమ్మిదిన్నరేండ్లలో మండల కేంద్రాలకు వెళ్లే సింగిల్ వరుస రోడ్లు డబుల్గా మారాయి. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా రోడ్ల నిర్మాణ పనులకు అధికంగా నిధులు మంజూరయ్యాయి. తాజా ఆయా మండలాలకు మంజూరైన నిధులతో పనులు త్వరగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కొనసాగుతున్న పనులు త్వరగా పూర్తయ్యేలా ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మండల కేంద్రం నుంచి రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి వరకు 2.6కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.32కోట్లు మంజూరు కాగా ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో ప్రయాణం ఆయా గ్రామాల ప్రజలకు ఎంతో సులభంగా మారింది. మండల పరిధిలోని పిడిచేడ్లో కిలోమీటర్ వరకు రోడ్డు విస్తరణ కోసం రూ.2.17కోట్లు మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయి. గతంలోనే పిడిచేడ్ గ్రామంలో డివైడర్ పనులు పూర్తి చేసి బటర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేశారు. రోడ్డు వెడల్పుతో గ్రామానికి కొత్త కళ సంతరించుకున్నది. తూప్రాన్ నుంచి జగదేవ్పూర్ వరకు రోడ్డు మరమ్మతు పనుల కోసం రూ.3కోట్లు మంజూరు కావడంతో పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్గల్ మండలం మజీద్పల్లి నుంచి తునికిబోల్లారం వెళ్లే మార్గంలో తునికిఖాల్సా వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 4.23కోట్లు మంజూరు కాగా పనుల ప్రారంభం కోసం ఇటీవల అధికారులు అగ్రిమెంట్ చేశారు. త్వరలోనే పనులు ప్రారంభించేలా ఆర్అండ్బీ అధికారులు చర్యలు చేపట్టారు. త్వరగా పనులు పూర్తి చేస్తే ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి నుంచి యాదాద్రిభువనగిరి జిల్లా సాల్వాపూర్ వరకు రెండు వరుసలుగా 4.2కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ.7.91కోట్లు మంజూరు కాగా ఈ పనుల కోసం సంబంధిత కాంట్రాక్టర్తో అధికారులు అగ్రిమెంట్ పూర్తి చేశారు. కొండపాక మండలం దుద్దెడ నుంచి కోనాపూర్ వరకు 3.1కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.5.12కోట్లు, దుద్దెడ టోల్గేట్ నుంచి బందారం వరకు 5.8కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.19.80కోట్లు, కుకునూర్పల్లి మండల కేంద్రం నుంచి బొబ్బాయిపల్లి వరకు 2.8కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ.6కోట్లు మంజూరు కాగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆయా గ్రామాల వరకు కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షిస్తూ నాణ్యతతో పనులు చేపట్టేలా చూస్తున్నారు.
గజ్వేల్ నుంచి చేగుంట వరకు గుంతలతో ఉన్న రోడ్డు రెండు వరుసలుగా మారింది. గతంలో గుంతలమయంగా ఉన్న రోడ్డుపై ఆటోల్లో ప్రయాణం చేయాలంటే నరకం చూసేవాళ్లం కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సీంఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడమే మా అదృష్టం. ఏ ఊరికి పోయినా అద్దంలా కనిపించేలా సీఎం రోడ్లకు మరమ్మతు చేయించారు.
-బండారు భాస్కర్, గిరిపల్లి, గజ్వేల్ మండలం
వర్షాకాలంలో మట్టిరోడ్డుపై నడవడమే ఇబ్బందిగా ఉండేది. వర్షాలు ఎక్కువ పడితే వాహనాలు, సైకిళ్లు పోయేవి కావు. మట్టి రోడ్డుకు కేసీఆర్, హరీశ్రావు కృషితో నిధులు మంజూరు కావడం సంతోషంగా ఉన్నది. వట్టిపల్లి నుంచి సాల్వాపూర్కు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. రోడ్డు మంజూరు కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తే కేసీఆర్, హరీశ్రావు నిధులు మంజూరు చేసి మా బాధలు తీర్చారు.
గజ్వేల్ పరిధిలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. కొండపాక మండలంలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. త్వరగా పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ఆయా గ్రామాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. కొన్ని పనులకు ఇటీవల టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. ఆ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తాం.
-బాలప్రసాద్, ఆర్అండ్బీ, ఈఈ, గజ్వేల్