చేర్యాల, జనవరి 6: చిన్న వయస్సులోనే వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా రాణిస్తున్న చేర్యాల పట్టణానికి చెందిన బొడ్డు వినోద్కుమార్ నేటి యూత్కు ఐకాన్గా మారాడు. అతడి వయస్సు 26 ఏండ్లు కానీ 1000 పైగా అవగాహన సదస్సులు నిర్వహించి వివిధ రంగాలకు చెందిన లక్షలాది మందికి వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించాడు. తెలంగాణ, ఏపీలోనే కాకుండా పొరుగు రాష్ర్టాల్లో సైతం అన్ని స్థాయిల విద్యార్థులను తన ప్రసంగాలతో ఉత్తేజ పరుస్తున్నాడు. పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ వీరేందర్ ఉపన్యాసంతో ప్రభావితుడైన తాను సైతం సైకాలజిస్టుగా స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు.
సిద్దిపేట నుంచి ప్రారంభమైన ప్రయాణం
2016లో సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మొట్ట మొదట ప్రసంగం చేసి తన ప్రయాణం ప్రారంభించాడు. నాటి నుంచి నేటి వరకు సుమారు 10లక్షలకు పైగా విద్యార్థులకు 1000కి పైగా ప్రసంగాలు చేసి వారితో ఉత్తేజం నింపాడు. ఎంతో మందికి జీవిత నైపుణ్యాన్ని పెంచే అనేక అంశాల పై శిక్షణ ఇచ్చాడు. ప్రసంగాలు, శిక్షణ ఇస్తూ ఎంతో మంది విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తల జీవితాల్లో వెలుగులు నింపుతూ ముందుకు సాగుతున్నాడు.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో…
1996 ఏప్రిల్ 17న చేర్యాల పట్టణంలో బొడ్డు తుకరామ్సువర్ణ దంపతులకు జన్మించిన వినోద్కుమార్ కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నాడు. పట్టణంలోని ప్రజంటేషన్ స్కూల్లో 7వ తరగతి, కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 8,910వ తరగతి పూర్తి చేశాడు. టెన్త్ పూర్తికాగానే హైదరాబాద్కు వచ్చాడు. ఇంటర్ ఎన్ఆర్ఐ, సెయింట్ మేరిస్లో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే వ్యక్తిగత వికాస సదస్సులు ప్రారంభించాడు. ప్రస్తుతం ఎంఏ సైకాలజీ చేస్తున్నాడు.
అవార్డ్స్ , రివార్డ్స్
ఆరు సంవత్సరాల తన జీవితంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఏసియన్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, కౌన్సెలింగ్, మనో జాగృతి తదితర ఆర్గనైజేషన్స్ ద్వారా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. 2020 తెలంగాణ యూత్ ఐకాన్ అవార్డు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, 2022లో బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అవార్డును తెలంగాణ ఆర్టీసీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నాడు.వీరితో పాటు ఏపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సెంట్రల్ లీడర్ల నుంచి అభినందలు పొందాడు. తెలుగు రాష్ర్టాల్లో ఎంతో మంది విద్యార్థులకు యూత్ ఐకాన్గా నిలిచాడు.
చరిత్ర సృష్టించాలి
చరిత్ర సృష్టించాలనే వివేకానందుడి సూక్తి నాకు సరిపడా శక్తిని ఇచ్చింది. స్టార్ట్ ఆఫ్ కంపెనీ ప్రారంభించాలని నా కోరిక. నా కంపెనీ ద్వారా పేదలు, విద్యార్థులకు ఉచిత శిక్షణ, వైద్యం అందించడమే లక్ష్యం. ఎంతోమందికి శిక్షణ ఇచ్చా. శిక్షణ పొందినవారు ఒక్కరు మారినా నా కృషికి దగ్గ ఫలితం వచ్చినట్లే. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని సమాజ అభ్యున్నతిలో పాలుపంచుకునే విధంగా ప్రోత్సహిస్తున్నా.
– వినోద్కుమార్