పటాన్చెరు టౌన్, మే 24: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలు డ్రగ్స్, గంజాయికి కేంద్రాలుగా మారాయి. గుట్టుచప్పుడు కాకుండా ఒడిశా, బీహార్, ఏపీ తదితర రాష్ర్టాల నుంచి రైలు మార్గం ద్వారా ఎండు గంజాయిని, డ్రగ్స్ను తెచ్చి పారిశ్రామికవాడల్లో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్న ఘటనలన్నీ ఇలాంటివే. ఇక్కడ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు తమ సొంత రాష్ర్టాలకు వెళ్లి గంజాయి, డ్రగ్స్ తెచ్చి గుట్టుగా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు అమ్ముతున్నారు.
పరిశ్రమల్లో ఉపాధి కంటే కూడా డ్రగ్స్, గంజాయి సరఫరా, అమ్మకాలే ప్రధాన ఆదాయ మార్గం గా ఎంచుకుంటున్నారు. నెల రోజుల వ్యవధిలో పటాన్చెరు పోలీసులు, ఎస్ఓటీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు మూడుసార్లు గంజాయిని సరఫరా చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు. పటాన్చెరు, పాశమైలారం, ఇస్నాపూర్, బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమల్లో పనిచేసే బీహార్, ఒడిశా రాష్ర్టాలకు చెందిన కొందరు కార్మికులు గంజాయి, డ్రగ్స్ సరఫరా, అమ్మకాలు చేస్తున్నారు. డబ్బు సంపాదనకు ఇదే సులువైన మార్గంగా ఎంచుకుంటున్నారు. పరిశ్రమల్లో పనిచేస్తూ తోటి కార్మికులతో పరిచయాలు పెంచుకొని మత్తు పదార్ధాలకు బానిసలు చేస్తున్నారు.
పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి
పారిశ్రామికవాడలు, జాతీయ రహదారులపై గంజాయి రవాణా చేసే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగానే, గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో యువత గంజాయిని పీల్చేందుకు ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారో తెలిసినా, ఎవరికి చెప్పాలో తెలియక నాయకులు, పలువురు యువకులు మనకేందుకులే అని ఊరుకుంటున్నారు. పోలీసులు భరోసా ఇస్తే గంజాయి రవాణా, స్థావరాలు, బానిసలుగా మారిన యువత వివరాలు ఇచ్చేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.

ఇటీవల గంజాయి పట్టుబడిన ఘటనలు
గంజాయి మత్తులో యువత
పారిశ్రామికవాడల్లో గుట్టుగా లభించే గంజాయి ఇప్పుడు గ్రామాలకు చేరింది. పటాన్చెరు నియోజకవర్గంలోని దాదాపు ప్రతి గ్రామంలో కొందరు యువత గంజాయి మత్తుకు వ్యసనం అయ్యారు. వీరికి గంజాయి రవాణా చేసే వ్యక్తులు, ఎక్కడ దొరుకుతుందో తెలుసు. సిగరేట్లలో గంజాయిని నింపి హుక్కాలాగా పీలుస్తున్నారు. మరికొందరు పది రూపాయల కూల్డ్రింక్ బాటిల్ కొని, అందులోని లిక్విడ్ తాగేసి బాటిల్కు హోల్ చేసి రీఫిల్ తీసేసిన పెన్ను పెడుతున్నారు.
బాటిల్లో గంజాయిని నిం పి పీలుస్తున్నారు. జనసంచారం లేని ప్రాంతాలు ఎంచుకొని గుంపులుగా మత్తులో జోగుతున్నారు. కొందరు యువత గంజాయి మత్తును ఎంజాయ్ చేస్తూ అర్ధరాత్రి దాటినా ఇండ్లకు రావడం లేదు. ఆలస్యమైందని తల్లిదండ్రులు అడిగితే వారి మీదికి తిరగబడుతున్నారు. పిల్లల సంగతి తెలిసిన తల్లిదండ్రులు తెలియనట్లు ఉంటున్నారు. అడిగితే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో అన్న భయంతో వారు మిన్నుకుంటున్నారు.