వారంతా కార్మికులు. ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎస్బీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. బుధవారం పరిశ్రమలో పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో వారి జీవితాలు తలకిందులయ్యాయి. పేలుడు ధాటికి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందగా.. వారి మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్తో పాటు మరో నలుగురు కార్మికులు చనిపోవడం బాధిత కుటుంబాల్లో పుట్టెడు దు:ఖాన్ని మిగిల్చింది. మాటకు అందని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాదంలో పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.
హత్నూర, ఏప్రిల్ 3: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామశివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్స్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం నాలుగు రియాక్టర్లు పేలి పరిశ్రమ డైరెక్టర్ రవితో పాటు మరో నలుగురు కార్మికులు సురేశ్ పాటిల్ (50) మధ్యప్రదేశ్, దయానంద్ (48) తమిళనాడు, సుబ్రహ్మణ్యం (36) ఆంధ్రప్రదేశ్తో పాటు మరొకరు మృతిచెందారు. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమలో రియాక్టర్లు పేలిన సమయంలో పెద్ద శబ్ధ్దాలు వచ్చాయి. పెద్దఎత్తున మంటలు చెలరేగి పరిసర గ్రామాలను పొగ కమ్మేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షతగాత్రులు సైతం గుర్తుపట్ట లేనివిధంగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడారు. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్ల్లో ఎంఎన్ఆర్ దవాఖానకు తరలించారు. విధులకు హాజరైన కార్మికులు ఎంతమంది ప్రమాదం బారిన పడ్డారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద విషయం తెలియగానే పరిసర గ్రామాల ప్రజ లు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని పరిశ్రమలో పనిచేస్తున్న తమవారి కోసం గాలించారు. రియాక్టర్లు భారీ శబ్ధంతో పేలిపోవడంతో పొగలు కమ్ముకోగా, పరిసర ప్రాంతంలోని పరిశ్రమల రేకుల షెడ్లు, పరిశ్ర మ భవనం పెద్దమొత్తంలో ధ్వంసమైంది. రేకులషెడ్లు, ఇనుపరాడ్లు ఎగిరిపడ్డాయి. పరిశ్రమ మొత్తాన్ని దట్టమైన మంటలు, పొగ కమ్మేయడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమించారు. సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్స్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరాతీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడంతో పాటు గాయపడ్డవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు. ఘటనా స్థలాన్ని ఆమె సందర్శించారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు డిమాండ్ చేశారు.
గాయపడ్డ కార్మికులను ఎంఎన్ఆర్ దవాఖానలో సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి పరామర్శించారు. పరిశ్రమలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి, ఏప్రిల్ 3: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లోని రసాయనిక పరిశ్రమలో పేలుడు ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు కార్మికులు మృతిచెందడంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పేలుడులో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మృతి చెందటం అత్యంత బాధాకరం అని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.