స్వరాష్ట్రంలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు మహర్దశ పట్టింది. ఒకప్పుడు వెనుకబాటుకు గురైన ఈ జిల్లాలు, ఇప్పుడు ఆకాశమే హద్దుగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. పల్లెలు, పట్టణాలు అన్నిరంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. సంగారెడ్డి పారిశ్రామిక, ఫార్మా, ఎడ్యుకేషన్, మాన్యుఫాక్చరింగ్ హబ్గా రూపాంతరం చెందుతున్నది. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, గిరిజన లా కాలేజీని ఏర్పాటు చేసింది. మెదక్లో కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం నిర్మిస్తోంది. మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ కృషితో రైలుమార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు జిల్లాల్లో నీటిపారుదల రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్యార్డులను నిర్మించింది. ఇంటింటికీ మిషన్ భగీరథతో తాగునీరందుతున్నది. డబుల్ బెడ్రూం పథకం ద్వారా పేదల సొంత ఇంటి కల సాకారమవుతున్నది. అన్నిరంగాల్లో జిల్లాలు పురోగమిస్తున్నాయి.
సంగారెడ్డి, మార్చి 15(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంగారెడ్డి జిల్లా దశ మారుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా నిధులు కేటాయిస్తూ సంగారెడ్డి జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు. ఫలితంగా జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. గత ఎనిమిదేళ్లలో సంగారెడ్డి జిల్లాలో రోడ్లు, భవనాల నిర్మాణం ఊపందుకుంది. విద్య, వైద్య, పారిశ్రామిరంగాల్లో జిల్లా పరుగులు పెడుతోంది. నీటిపారుదల రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. కోట్లాది నిధులను నీటిపారుదల రంగానికి ప్రభుత్వం కేటాయిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్యార్డులను ప్రభుత్వం నిర్మించింది. గ్రామాల్లో ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధ్ది పనులు చేపట్టడంతో పాటు ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తోంది. డబుల్ బెడ్రూం పథకం ద్వారా పేదల సొంత ఇంటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోంది. సీఎం కేసీఆర్ సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, గిరిజన లా కాలేజీని ఏర్పాటు చేశారు. మనఊరు-మనబడి ద్వారా గ్రామాలు, పట్టణాల్లోని బడుల రూపురేఖలు మారుస్తున్నారు. దవాఖానల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది.
సంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక రంగం గత ఎనిమిదేండ్లలో పరుగులు తీస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం వంద భారీ, మధ్య తరహా పరిశ్రల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. గతేడాది ప్రభుత్వం 318 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా, రూ.5వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్లో నిమ్జ్లో పరిశ్రమల ఏర్పాటుకు గతేడాది జూన్లో రాష్ర్ట ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గతేడాది జూన్లో నిమ్జ్లో వెమ్టెక్ డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
రూ.2100 కోట్లతో ట్రైటాన్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ నిమ్జ్లో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నది. నిమ్జ్లో ఎలక్ట్రిక్ వాహనాలు, డిఫెన్స్ రంగానికి సంబంధించి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. రూ.1000 కోట్ల పెట్టుబడులతో పలు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. నిమ్జ్తో వేల మందికి ఉపాధి లభించనుంది. పటాన్చెరు నియోజకవర్గంలోని సుల్తాన్పూర్లో ప్రభుత్వం 240 ఎకరాల్లో మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు చేసింది. వేలకోట్ల పెట్టుబడులతో 69 పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. మెడికల్ డివైజ్ పార్కుతో 6400 మందికి ఉపాధి లభించనున్నది. 20కి పైగా పరిశ్రమలు ఉత్పత్తులను ప్రారంభించాయి. ఆకృతి పరిశ్రమ కంటివెలుగులో పంపిణీ చేసే కండ్ల అద్దాలను తయారు చేస్తోంది.
సహజానంద కంపెనీ స్టంట్స్లను తయారు చేయడంతో పాటు మెడికల్ డివైజ్ రంగంలో పరిశోధనలు చేపడుతోంది. జిన్నారం మండలంలోని శివానగర్లో ప్రభుత్వం రూ.328 కోట్ల పెట్టుబడితో 66 ఎకరాల్లో ఎల్ఈడీ పార్కును ఏర్పాటు చేస్తోంది. ఈ పార్కులో 26కు పైగా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా రెండువేల మందికి పరోక్షంగా మరో రెండు వేల మందికి ఉపాధి లభించనున్నది. మునిపల్లి, కోహీర్ మండలాల్లో ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో నీటిపారుదల రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం సంగారెడ్డి జిల్లాలో నీటిపారుదల రంగానికి స్వర్ణయుగం వచ్చింది. మిషన్ కాకతీయ ద్వారా 2617 చెరువుల పూడికతీత పనులు, చెరువుకట్ట మరమ్మతు పనులు చేపట్టి చిన్ననీటిపారుదల రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చింది.జిల్లాలోని ఏకైక నీటిపారుదల ప్రాజెక్టు సింగూరు హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేది తప్ప జిల్లాలో ఒక్క ఎకరాకు సాగునీరు అందేది కాదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం సింగూరు ప్రాజెక్టు ద్వారా జంటనగరాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిపివేసి జిల్లాకు సాగునీరు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్ది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సుమారు రూ.100 కోట్ల నిధులతో సింగూరు ప్రాజెక్టు కాల్వలు ఇతర పనులు చేపట్టి 40వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ గోదావరి జలాలను తేవాలని సంకల్పించారు. మల్లన్నసాగర్ నుంచి సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తరలించనున్నారు. ఇందుకోసం ప్యాకేజీ 19 పనులు వేగంగా సాగుతున్నాయి. ప్యాకేజీ 19 పనులు పూర్తయితే 17527 ఎకరాలకు సాగునీరు అందనున్నది. సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి జలాలు చేరుకున్న వెంటనే పంటపొలాలకు తరలించేందుకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రకటించారు. రూ.4427 కోట్లతో చేపట్టే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులకు సీఎం కేసీఆర్ నారాయణఖేడ్లో స్వయంగా శంకుస్థాపన చేశారు.
మంత్రి హరీశ్రావు ఇటీవలే బోరంచలో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు సంబంధించి భూసేకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.2653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పనులు చేపడుతున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. బసవేశ్వర ఎత్తిపోతల పథకం రూ.1774 కోట్లతో నిర్మించనున్నారు. ఈ పథకం ద్వారా నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం మంజీరా నదితో పాటు ఇతర ప్రాంతాల్లో రూ.40 కోట్లతో 11 చెక్డ్యామ్లను నిర్మిస్తోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో రూ.56.48 కోట్లతో ఎనిమిది కొత్త చెరువులను నిర్మిస్తున్నది.
సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత సంగారెడ్డి జిల్లా అభివృద్ధ్దిలో పరుగులు పెడుతున్నది. ప్రభుత్వం జిల్లాలోని 647 పంచాయతీల్లో కోట్లాది రూపాయల నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలను నిర్మించింది. ప్రతి మండల కేంద్రం నుంచి గ్రామాలకు రహదారులను నిర్మించింది. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు, క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసింది. రైతులు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా 115 రైతు వేదికల నిర్మాణం చేపట్టింది. రూ.200 కోట్లతో సంగారెడ్డి జిల్లాలో రహదారుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల విస్తరణ కోసం ప్రభుత్వం రూ.70 కోట్లు ఇటీవల విడుదల చేసింది. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారుల మరమ్మతులకు రూ.150 కోట్లు విడుదల చేసింది.
రూ.45 కోట్లతో ప్రభుత్వం పటాన్చెరు-శంకర్పల్లి రహదారి నిర్మాణం పనులు ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లాకు రూ.527 కోట్లతో ప్యాకేజీ ప్రకటించారు. రూ.155 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జిల్లాలోని 607 పంచాయతీల్లో రూ.121 కోట్లతో 2478 పనులు చేపడుతున్నారు. ఎనిమిది మున్సిపాలిటీల్లో రూ.250 కోట్లతో 939 పనులు చేపడుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు అందజేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 944 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. రూ.1138.22 కోట్లతో ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో మిషన్ భగీరథ పథకం పూర్తి చేసింది. జిల్లాలోని అన్ని పంచాయతీలు, తండాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందజేస్తున్నది. పేదల ప్రజల సొంతింటి కలను డబుల్బెడ్రూమ్ పథకం ద్వారా సాకారం చేస్తోంది ప్రభుత్వం జిల్లాకు రూ.338.11 కోట్లతో 5920 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు రూ.210 కోట్లతో 3318 ఇండ్లు పూర్తయ్యాయి. 2102 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేశారు. రూ.42 కోట్ల వ్యయంతో 22 గోదాములను నిర్మించింది. మార్కెట్యార్డుల అభివృద్ధికి రూ.25.78 కోట్లు విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. సంగారెడ్డి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా సీఎం కేసీఆర్ మారుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ సంగారెడ్డిలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. 150 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సంగారెడ్డిలో రూ.30 కోట్లతో నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా సంగారెడ్డిలో 350 పడకల దవాఖాన, మాతాశిశు సంక్షేమ దవాఖానను ప్రారంభించింది. టీ-డయాగ్నాస్టిక్ హబ్ ద్వారా 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నది.
సంగారెడ్డిలో రూ.37 కోట్లతో క్రిటికల్ కేటర్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సంగారెడ్డి, జహీరాబాద్లో టిఫా స్కాన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. పటాన్చెరులో 250 పడకల మల్టీ సెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేస్తోంది. సదాశివపేట, జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్లో 100 పడకల దవాఖానలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. నారాయణఖేడ్, జోగిపేట దవాఖానల్లో డయాలసిస్ సేవలను ప్రారంభించింది. జిల్లాలో 13 బస్తీ దవాఖానలు, 158 పల్లె దవాఖానలను ఏర్పాటు చేసింది. రూ.4 కోట్లతో జిల్లాలో కొత్తగా 20 సబ్సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రెండో విడత కంటివెలుగు ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని వారికి ఉచిత కంటి పరీక్షలు చేసి ప్రభుత్వం కండ్ల అద్దాలు పంపిణీ చేస్తోంది. మెడికల్ కాలేజీతో పాటు ప్రభుత్వం సంగారెడ్డిలో గిరిజన లా కాలేజీని ఏర్పాటు చేసింది. జిల్లాలో 30కిపైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. మనఊరు-మనబడి ద్వారా రూ.100 కోట్ల నిధులతో జిల్లాలోని పాఠశాలలను ఆధునీకరిస్తోంది.