సంగారెడ్డి, డిసెంబర్ 29 : ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో తీసుకున్న పనులను త్వరగా పూర్తిచేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ రాజర్షితో కలిసి ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమ పనుల పురోగతి, ఎఫ్టీవోల జనరేట్, మోడల్ స్కూల్స్ పనుల పురోగతి, తదితర అంశాలపై విద్య, ఇంజినీరింగ్శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేనెల 5తేదీ లోగా ‘మన ఊరు-మన బడి’లో చేపట్టిన పనులు పూర్తిచేసి మోడల్ పాఠశాలలు ప్రారంభానికి సిద్ధ్దం చేయాలన్నారు.
పనులు పూర్తి అయినవి, ఇప్పటి వరకు చేసిన పనులను ఆఫ్లోడ్ చేసిన ఎఫ్టీవోల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని, పూర్తయిన పనులకు వెంటనే ఎఫ్టీవో (ఫడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్)లను అప్లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో ‘మన ఊరు-మన బడి’లో చేపట్టిన 66 మోడల్ పాఠశాలల పనులను జనవరి 5 లోగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఆయా మోడల్ పాఠశాలలకు పెయింటింగ్, ఫర్నిచర్, పాత్వే, ప్లాంటింగ్, చిల్డ్రన్ప్లే ఉండాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే ఇవ్వాలని ఎంఈవోలను ఆదేశించారు. మోడల్ పాఠశాలలకు సంబంధించి పెయిటింగ్ తదితర పనులను చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులదేనని స్పష్టంచేశారు.
మన ‘ఊరు-మన బడి’కి నిధుల కొరతలేదు..
ప్రభుత్వం ప్రాతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ పథకానికి నిధుల కొరతలేదని, పనులు చేసి ఎఫ్టీవోలు జనరేట్ చేసిన వెంటనే నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిధులు ఇస్తున్న పనులు త్వరితగతిన పూర్తి చేయకపోవడంపై కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజీఎస్, ఎస్ఎంసీ పనుల్లో ఉన్న బకాయిలను జనవరి 5తేదీ లోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టులోని పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించి పర్యవేక్షించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఏఈలు, సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశాలు నిర్వహించి పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అధికారులు ‘మన ఊరు-మనబడి’ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్కు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్, ఇంజినీరింగ్ అధికారులు, ఎంఈవోలు విద్యాశాఖ పాన్లింగ్ కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
పనులను వేగవంత చేయాలి
మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
చిన్నశంకరంపేట, డిసెంబర్ 29 : ‘మనఊరు -మనబడి’ నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. గురువారం మండల పరిధిలోని జంగరాయి గిరిజన తండా దర్పల్లి, మడూర్, గజగట్లపల్లి, అంబాజిపేట పాఠశాలలో జరుగుతున్న ‘మన ఊరు- మనబడి’ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడారు. ‘మన ఊరు- మనబడి’ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని సంబంధిత గ్రామాల సర్పంచ్లకు సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యంగా ఉండే విధంగా పనులను చేపట్టాలని సూచించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఆమె వెంట డీఈ పాండు రంగారెడ్డి, ఎంపీడీవో గణేశ్రెడ్డి, ఏఈ విజయ్ కుమార్ సంబంధిత గ్రామాల సర్పంచ్లు ఉన్నారు.