దుబ్బాక/మిరుదొడ్డి, నవంబర్ 30: అక్బర్పేట-భూంపల్లి, కుకునూరుపల్లి, నిజాంపేట కొత్త మండలాలు ఏర్పాటుచేసి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల దశాబ్దాల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నిజం చేశారని, కొత్త మండలాల ఏర్పాటుతో పాలన మరింత చేరువ కానుందని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు వేగంగా అమలై ప్రజలకు మేలు జరుగుతుందని ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట-భూంపల్లి నూతన మండల తహసీల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం తప్ప బీజేపీ నాయకులకు అభివృద్ధి చేయడం చేతకాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అంటున్న వారిని కూడవెల్లి వాగులో ముంచితే నీళ్లు పారుతున్నది లేనిది తెలుస్తుందని ఎద్దేవా చేశారు. వంటగ్యాస్, పెట్రో,డీజిల్ ధరలు పెంచడం తప్ప ప్రజలకు కేంద్ర సర్కారు చేసిందేమీ లేదన్నారు. బోరుబావులకు మీటర్లు పెట్టక పోవడంతో రాష్ర్టానికి రావాల్సిన రూ.12 వేల కోట్లు కేంద్రం ఆపిందని, బీజేపీ నాయకులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
– మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
పెద్దశంకరంపేట, నవంబర్ 30: పెద్దశంకరంపేట మండలంలో మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ఎంపికైన పాఠశాలల్లో పనులు వేగవంతం చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం మండలంలోని చీలపల్లి, ఉత్తులూరు గ్రామాల్లో జరుగుతున్న మన ఊరు- మనబడి పనులను ఆమె పర్యవేక్షించారు. పెద్దశంకరంపేటలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను, మోడల్ పాఠశాలలో విద్యా బోధనను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. పలు గ్రామాల్లో పనులు నత్తనడకన నడుస్తుండడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెతో ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎంపీడీవో రఫీకున్నీసా బేగం, ఎంపీటీసీ వీణా సుభాశ్గౌడ్, నాయకులు అంజయ్య, శంకర్గౌడ్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు విఠల్నాయక్, రామచంద్రాచారి, వెంకటేశం, రాములు, సంగమేశ్వర్, తదితరులున్నారు.