దుబ్బాక, నవంబర్ 23 : సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా మారాయని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు కులమతాలకతీతంగా గడపగడపకూ చేరుతున్నాయన్నారు. బుధవారం దుబ్బాక రెడ్డి సంఘంలో కల్యాణలక్ష్మి , షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దుబ్బాక మున్సిపల్, మండలానికి చెందిన 126 మందికి కల్యాణలక్ష్మి, నలుగురికి షాదీముబారక్ చెక్కులు అందజేశారు.
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధితోపాటు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి రోల్మోడల్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఆసరా పిం ఛన్లు వస్తున్న నియోజకవర్గంగా దుబ్బాక ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వమైనా ఇలాంటి పథకాలను అమలు చేసిందా అని ప్రశ్నించారు. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. మాయ మాటలు చెప్పే పార్టీలను భూస్థాపితం చేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే కేంద్రంలో ఉన్న బీజేపీ పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నదని మండిపడ్డారు. డబుల్ ఇం జిన్, త్రిబుల్ ఇంజిన్ అంటూ బీజేపీ దిగజారుడు రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిందని విమర్శించారు. దేశంలో పేదలు, రైతులను బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. అబద్ధాలు, మోసాలతో కేంద్రంలో బీజేపీ సర్కారు పాలన కొనసాగిస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణలో అభివృద్ధి, జీడీపీ (ద్రవ్యోల్భలం) ముందంజలో ఉందన్నారు. దీనిని జీర్ణించుకోలేకనే బీజేపీ నాయకులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేడు దేశంలో తెలంగాణ అన్నా.. తెలంగాణ ఎంపీలన్నా ప్రత్యేక గౌరవం దక్కిందన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ కృషి ఫలితమేనని, తెలంగాణ ప్రజల దీవెనలేనని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని, ఆయన నాయకత్వాన్ని దేశపౌరులు కోరుకుంటున్నారని తెలిపారు.
రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచేందుకే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అన్న చందంగా.. ఇల్లు, పెండ్లి రెండు కార్యక్రమాలు ఆర్థికంగా కూడుకున్నవేనని తెలిపారు. పెండ్లి చేయాలంటే పేదలకు ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉంటుంది. పేదల కష్టాలు సీఎం కేసీఆర్కు తెలుసు కాబట్టే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలచారని తెలిపారు.
కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిందన్నారు. కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, వైస్ చైర్మన్ అదికం సుగుణాబాలకిషన్గౌడ్, దుబ్బాక ఎంపీపీ పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, ఆత్మకమిటీ చైర్మన్ భాస్కరాచారి, పీఏసీఎస్ చైర్మన్ కైలాశ్, మున్సిపల్ కమిషనర్ గణేశ్రెడ్డి, తహసీల్దార్ సలీం మియా, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనోహర్రావు, రాజమౌళి, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మిరుదొడ్డి, నవంబర్ 23: పల్లెలను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేయడానికి సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించి వ్యవసాయ రంగానికి సాగునీరు అందిస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చెప్యాలలో రూ.5లక్షలతో అంగన్వాడీ భవనం, రూ.4లక్షలతో ఎస్సీ కమ్యూనిటీహల్, రూ.5లక్షలతో బీసీ కమ్యూనిటీ హల్, మల్లుపల్లిలో రూ.5లక్షలతో కమ్యూనిటీ హల్, మిరుదొడ్డిలో రూ.10లక్షలతో ఓపెన్ జిమ్, రూ.5 లక్షలతో రీడింగ్ రూం, కాసులాబాద్లో రూ.5లక్షలతో మహిళా భవనం, లక్ష్మీనగర్లో రూ.8లక్షలతో మహిళా భవనం, రూ.5లక్షలతో బీసీ కమ్యూనిటీ హల్, ఆరెపల్లిలో పాఠశాలలో రూ.5లక్షలతో అదనపు గది నిర్మాణానికి భూ మి పూజలు చేశారు.
చెప్యాలలో వలపు బాలయ్య, రాచమల్లు స్వామి, అక్కరాజు దుర్గయ్య ఇటీవల మృతిచెం దారు. మృతుల కుటుంబాలను ఓదార్చి దుర్గయ్య కుటుంబానికి రూ.5వేలు, మిరుదొడ్డిలో పక్కీగల్ల రాజు, పుల్లూరి సుమన్ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబాలను పరామర్శించి సుమన్ కుటుంబానికి రూ.5వేలు ఆర్థిక సాయం చేశారు. కాసులాబాద్ ప్రాథమిక పాఠశాలను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బొంపల్లి మనోహర్రావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్రావు కృషితో పల్లెల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పీటీసీ లక్ష్మీలింగం, ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాల్రాజు, సర్పంచులు సిద్ధి భారతీభూపతిగౌడ్, రాములు, సత్యనారాయణ, ఎంపీటీసీలు లక్ష్మీమల్లయ్య, శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, రైతు విభాగం మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, నాయకులు కమలాకర్రెడ్డి, పరశురాములు, మల్లయ్య, మల్లారెడ్డి, బాగులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.