చల్లని గాలులు, దట్టమైన మేఘాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సంగారెడ్డి జిల్లాలో గురువారం పలుచోట్ల మోస్తరు వర్షం కురువగా, మెదక్ జిల్లాలో మేఘావృతమైంది. కోహీర్లో వర్షంతో పాటు వడగండ్లు పడ్డాయి. న్యాల్కల్లో ఉరుములు, మెరుపులతో గాలిదుమారం చెలరేగింది. మునిపల్లి, రాయికోడ్, నాగల్గిద్దలోనూ వర్షం పడింది. నేడు, రేపు కూడా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
– సంగారెడ్డి న్యూస్నెట్వర్క్, మార్చి 16
గురువారం ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. గాలి, దుమారం, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో జొన్న, శనగ, మినుము, గోధుమ, కుసుమ, ఉల్లి తదితర పంటలు, కూరగాయలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలపాలయ్యాయి. ఈదురుగాలులతో పలు ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. కాల్వలు పొంగిపొర్లాయి. రోడ్లపై నీరు ప్రవహించింది. మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామంలో వారాంతపు సంత ఆగమైంది. కూరగాయల నిండా వడగండ్లు ముంచెత్తాయి. దీంతో కొంతమంది వ్యాపారులు ఆకుకూరలు, కూరగాయలను అంగట్లోనే వదిలి వెళ్లారు.
– న్యూస్నెట్వర్క్, సంగారెడ్డి/మెదక్