రామచంద్రాపురం, అక్టోబర్ 19: బీఆర్ఎస్ పటాన్చెరు అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికే తమ మద్దతు అంటూ ఉప్పరి (సగర) సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. గురువారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో ఎమ్మెల్యే, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డిని ఉప్పరి సంఘం నాయకులు కలిసి వారి మద్దతు తెలిపారు. అనంతరం వారు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అన్నివర్గాల వారు మెచ్చి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్నివర్గాల వారు అభివృద్ధి చెందారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చి రైతులు కోటీశ్వరులు అయ్యారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా, రైతుబంధు, దళితబంధు, బీసీ, మైనార్టీ బంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, ఉచిత తాగునీరు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఉచిత కరెంట్ ఇలా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పేదలకు ఎంతో మేలు జరిగిందన్నారు. సీఎంఆర్ఎఫ్తో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతున్నదన్నారు.
ఉప్పరి(సగర) సంఘం తమకు మద్దతు ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. అనంతరం భూపాల్రెడ్డి మాట్లాడుతూ ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి బీడు భూములను పచ్చగా మార్చిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. అన్నివర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, నాయకులు ఆదర్శ్రెడ్డి, కుమార్గౌడ్, సంఘం జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, ప్రధానకార్యదర్శి అంజయ్య, కోశాధికారి వెంకటయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.