సిద్దిపేటరూరల్/కొమురవెల్లి, ఏప్రిల్ 19: జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మండే సూర్యుడికి జనం అల్లాడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే మేలో ఎండలు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. ఉదయం తొమ్మిది గంటలైతే చాలు ఉక్కపోత, చెమటలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోలేక చల్లటి పదార్థాలు సేవిస్తున్నారు. మధ్యాహ్నం 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదతున్నాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడ దెబ్బ తగలకుండా రైతులు, కార్మికులు, దినసరి కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జాగ్రత్తలు ఇవే..
వడదెబ్బ సోకిన వ్యక్తికి కాళ్ల నొప్పులు, కండ్లు తిరగడం, శరీర కండరాలు పట్టుకోవడం, తీవ్రమైన జ్వరం లక్షణాలు ఉంటాయి. అధికంగా చమటపట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి జరిగితే వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించి వైద్యం చేయించాలి. శరీరంలో ఎక్కువగా ఉష్ణోగ్రత పెరిగితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. వేడి వాతావరణం తట్టుకోలేని శరీరం త్వరగా అలసిపోతుంది. దీంతో శరీరంలోని అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి. రోడ్లపై విక్రయించే రకరకాల
కూల్డ్రింక్లు తాగరాదు. వేసవిలో మాంసాహారం తగ్గించి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
వేసవిలో చిన్నారులు బయట ఆటలు ఆడకుండా నీడపట్టున ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. జంకుఫుడ్కు దూరంగా ఉంచాలి. నీడ ప్రాంతంలో లేదా బాల్కానీల్లో ఆటలకు అనుమతిస్తే మంచిది. ఫ్రిజ్లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన కూల్డ్రింకులు, చల్లటి ఐస్క్రీంలు ఇస్తే చిన్నారుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.