సిద్దిపేట టౌన్, డిసెంబర్ 31: అయ్యప్ప స్వామి నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వామిని కీర్తిస్తూ సాగిన శోభాయాత్ర అందరిలో భక్తి భావాన్ని నింపింది. వందలాది మంది అయ్యప్ప స్వాములు, భక్తజన వాహినితో శోభాయాత్ర ఆసాంతం ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట అయ్యప్ప స్వామి ఆలయం నుంచి స్వాముల శోభాయాత్ర కమాన్ రోడ్డు, గాంధీ చౌక్, విక్టరీ చౌరస్తా మీదుగా కోమటి చెరువు వరకు వైభవంగా సాగింది.
అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురు స్వామి సముద్రాల రమేశ్ ఆధ్వర్యంలో కోమటి చెరువులో అయ్యప్ప స్వామికి జలాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం గురుస్వామి సముద్రాల రమేశ్ మాట్లాడుతూ సిద్దిపేటలో అయ్యప్ప స్వాముల మాలధారణ ప్రారంభమైనప్పటి నుంచి స్వామి వారి శోభాయాత్ర ఆనవాయితీగా నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు కోమటి చెరువు వద్ద అయ్యప్ప స్వాములకు, భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.