జహీరాబాద్, ఆగస్టు 11: చుక్క నీటిని వృథాగా పోనీయకుండా తెలంగాణ ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణంతో చెక్ పెడుతున్నది. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలంలో చెక్డ్యాంలు నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేసింది. పలు చోట్ల నిర్మాణాలు చేపట్టేందుకు నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మొదటి విడతగా నిర్మాణాల్లో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.3.50కోట్లు మంజూరు చేసింది. న్యాల్కల్ మండలంలోని చినిగేపల్లి పెద్దవాగుపై చెక్డ్యాం నిర్మాణానికి రూ.1.09 కోట్లు, చికుర్తి పెద్దవాగుపై చెక్డ్యాం నిర్మాణానికి రూ.68 లక్షలు, హుమ్నాపూర్ పెద్దవాగుపై చెక్డ్యాం నిర్మాణానికి రూ.కోటి, ఝరాసంగం మండలంలోని కుడిసంగ పెద్దవాగుపై చెక్డ్యాం నిర్మాణానికి రూ.57లక్షలు మంజూరు చేసింది. జహీరాబాద్ మండలంలోని మల్చల్లా పెద్దవాగుపై రూ.75.08 లక్షలతో చెక్ డ్యామ్ నిర్మించనున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగిసాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని, రెండు పంటలకూ నీరు లభించే అవకాశం ఉన్నదని రైతులు, నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
న్యాల్కల్ మండలంలో మూడు భారీ చెక్డ్యాంలు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మండల పరిధిలోని చినిగేపల్లి పెద్దవాగుపై చెక్డ్యాం నిర్మాణానికి రూ.1.09 కోట్లు, చికుర్తి పెద్దవాగుపై రూ.68 లక్షలతో, హుమ్నాపూర్ పెద్దవాగుపై రూ. కోటితో చెక్ డ్యాంలను నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. ఈ మూడు చెక్డ్యాంలు నిర్మాణంతో చాల్కి, హుమ్నాపూర్, చికుర్తి, చినిగేపల్లితో పాటు పలు గ్రామాల రైతులకు మేలు కలుగనున్నది. వర్షాకాలంలో ఎత్తయిన ప్రాంతాలు, గుట్టలు, వాగులు, వంకల ద్వారా వాననీరు వృథాగా మంజీరా నదిలోకి పోతుంది. ఈ నీటినినిల్వ కోసం సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఝరాసంగం మండలంలోని కుడిసంగం శివారులో పెద్దవాగుపై చెక్డ్యాం నిర్మించేందుకు ప్రభుత్వం రూ.57 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడంతో నిధులు మంజూరు చేశారు. ఈ చెక్డ్యాం నిర్మాణంతో ఝరాసంగం, కుడిసంగం, బొప్పన్పల్లి, నర్సపూర్తో పాటు పలు గ్రామాలకు సాగునీరు అందడమే కాకుండా భూగర్భ జలాలు పెరుగనున్నాయి.
జహీరాబాద్ మండలంలోని మల్చల్మా పెద్దవాగుపై చెక్డ్యాం నిర్మాణానికి ప్రభుత్వం రూ.75.08 లక్షలు మంజూరు చేసింది. కోహీర్ మండలంలోని గోటిగార్పల్లి పెద్దవాగు ప్రాజెక్టు నుంచి వాగుల ద్వారా వరద వచ్చి పెద్దవాగులోకి ప్రవేశించి, మల్చల్మా జాడిమల్కాపూర్ జలపాతం ద్వారా కర్ణాటకలోకి వరదనీరు వెళ్తుంది. ఇక్కడ చెక్డ్యాం నిర్మాణంతో మల్చల్మా, గోటిగార్పల్లి, మల్చల్మా తండా రైతులకు మేలు కలుగనున్నది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో టెండర్లు వేసి పనులు ప్రారంభించేందుకు నీటిపారుదల ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జహీరాబాద్ డివిజన్లో పెద్ద ప్రాజెక్టులు, చెరువులు లేకపోవడంతో రైతులు వర్షధారంగా పంటలు సాగు చేస్తారు. వాగులు, వంకలు ఉన్నా చెక్డ్యాంలు, చెరువులు లేకపోవడంతో రైతులు వర్షాలపై ఆధారపడి పంటలు పండించేవారు. ఎక్కువ వర్షపాతం నమోదైనా నీటిని నిల్వ చేసి సాగుకు అందించడంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో రైతులు సాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వర్షం నీరునిల్వ చేసేందుకు భారీగా ప్రాజెక్టులు, చెరువులు, చెక్డ్యాంలు నిర్మాణం చేపడుతున్నది. ఇప్పటికే మిషన్ కాకతీయలో భాగంగా చెరువులకు ఆధునీకరణ పనులు చేసింది. జహీరాబాద్ ప్రాంతంలో నీటి సమస్యలు పరిష్కరించేందుకు నారింజ ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి వరద నీటిని నిల్వ చేశారు. ప్రస్తుతం ఆయా చెరువులపై కొత్తగా చెక్డ్యాలు నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో వర్షపు నీరు నిల్వ చేసేందుకు చెక్డ్యాంలు నిర్మాణం చేస్తున్నాం. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో 5 చెక్డ్యాంలు నిర్మించేందుకు రూ.3.50 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే మిషన్ కాకతీయలో నారింజ ప్రాజెక్టు, ఇతర చెరువులకు మరమ్మతులు చేసి వరద నీటిని నిల్వ చేశాం. ప్రస్తుతం చెక్డ్యాంల నిర్మాణంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు, అందుకోసం కృషి చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కొనింటి మాణిక్రావు, ఎమ్మెల్యే జహీరాబాద్