మెదక్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): చివరి ఆయకట్టుకూ నీరందించేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. గతంలో కొంత వరకే సిమెంట్ లైనింగ్ పనులు పూర్తి కావడంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు ఇబ్బందులు పడ్డారు. ఘనపూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేయలేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దఎత్తున నిధులు విడుదల చేయడంతో మహబూబ్నహర్, ఫత్తేనగర్ కాలువల ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ వద్ద మంజీరానదిపై 0.2 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఘనపూర్(వనదుర్గ) ప్రాజెక్టును నిర్మించారు. పూడిక కారణంగా కేవలం 0.135 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటున్నది. ఘనపూర్ ఆయకట్టు పరిధి కింద 21,625 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేస్తున్నది. ప్రాజెక్టు పరిధిలోని మహబూబ్నహర్, ఫత్తేనహర్ కాలువల ఆధునీకరణకు మొత్తం రూ.45.64 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. వీటిలో పాపన్నపేట మండలం పరిధిలోని ఫత్తేనహర్ ప్రధాన కాల్వ 12.8 కిలోమీటర్లు, కొల్చారం మండలం పోతంశెట్పల్లి, రాంపూర్, మెదక్ మండలంలోని మాచవరం, చిట్యాల, మెదక్ పట్టణం మీదుగా హవేళీఘనపూర్ మండలం శాలిపేట వద్ద గల నక్కవాగు వరకు 32 కిలోమీటర్ల మేర మహబూబ్నహర్ కాలువ సిమెంట్ లైనింగ్ పనులు పూర్తి చేశారు. అసంపూర్తిగా ఉన్న పనులకు రాష్ట్ర ప్రభుత్వం 2022 జనవరిలో రూ.50.35 కోట్లు కేటాయించింది. దీంతో మిగిలిన 12.6 కిలోమీటర్ల కాల్వ సిమెంట్ లైనింగ్, ఎఫ్ఎన్ పరిధిలో 27 కిలోమీటర్ల బ్రాంచ్ కెనాల్స్ ఆధునీకరణ పనులు పూర్తి చేయనున్నారు. హవేళీఘనపూర్ మండలం కూచన్పల్లి, ముత్తాయిపల్లి గ్రామాల వద్ద వంతెనలను నిర్మించారు.
ఘనపూర్ ప్రాజెక్టు పరిధిలో మహబూబ్నహర్, ఫత్తేనగర్ అనే రెండు కాల్వల ద్వారా చివరి ఆయకట్టు వరకూ సాగునీరందాలంటే సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టాలి. దీంతో రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2015-16లో జైకా సంస్థ రూ.23 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం 2017-18లో రూ.21కోట్లు మంజూరు చేసింది. మహబూబ్నహర్ కాల్వ 43.68 కి.మీ పరిధిలో 32 కి.మీ వరకు పనులు పూర్తి చేశారు. 2016లో అప్పటి ఇరిగేషన్శాఖ మంత్రి హరీశ్రావు, అప్పటి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డితో కలిసి హవేళీననపూర్ మండలం ముత్తాయిపల్లి శివారులో ఈ కెనాల్ను పరిశీలించారు. కొల్చారం, మెదక్ మండలాల్లో పనులు పూర్తి కాగా, హవేళీఘనపూర్ మండలం శాలిపేట నక్కవాగు వద్ద సిమెంట్ లైనింగ్ పనులు నిలిచిపోయాయి. దీంతో అధికారులు ఎంఎన్, ఎఫ్ఎన్ కాల్వల సిమెంట్ లైనింగ్ పనుల కోసం రూ.55 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2022 బడ్జెట్లో రూ.50.35 కోట్లు ఎంఎన్, ఎఫ్ఎన్ కాల్వల సిమెంట్ లైనింగ్ పనులకు కేటాయించారు. ఇందులో 10 కి.మీ సిమెంట్ లైనింగ్ పనులకు రూ.21 కోట్లు కేటాయించారు. ఈ పనులు శాలిపేట నుంచి పోచారం డ్యాం వరకు కొనసాగుతున్నాయి. ఫత్తేనహర్ కాల్వ కింద 12 కిలోమీటర్లకు రూ.23 కోట్లు కేటాయించారు. ఘనపూర్ ఆనకట్టలో నీరు నిల్వ ఉండడంతో ఈ పనులు చేపట్టడం లేదు. ఈ సీజన్ ముగిసిన తర్వాత పనులు చేపట్టనున్నారు.
ఘనపూర్ ప్రాజెక్టు కింద ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగి పంటలకు సాగు నీరందిస్తున్నారు. ఘనపూర్ ప్రాజెక్టు కింద 21,625 ఎకరాలకు సాగునీరు అందించగా, రెండు పంటలూ పుష్కలంగా పండుతున్నాయి. మంజీరానదిపై 0.2 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కొల్చారం మండలం చిన్నఘనపూర్ వద్ద ఆనకట్ట నిర్మించారు. కొల్చారం, పాపన్నపేట, మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లో 21,625 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికింద మహబూబ్నహర్ (ఎంఎన్), ఫత్తేనహర్ (ఎఫ్ఎన్) కాల్వలను ఏర్పాటు చేశారు. మహబూబ్నహర్ కాలువ ద్వారా మెదక్, హవేళీఘనపూర్, కొల్చారం మండలాలకు, ఫత్తేనహర్ కాల్వ ద్వారా పాపన్నపేట మండలంలోని చివరి ఆయకట్టుకు సాగునీరందించేలా కెనాళ్లను నిర్మించారు. సింగూరు ప్రాజెక్టులో 0.4 టీఎంసీల నీరుండగా, ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగి సీజన్లలో సాగునీటిని ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తారు. దీంతో ఘనపూర్ ప్రాజెక్టు కింద 21,625 ఎకరాలకు సాగునీరు అందగా, ఎంఎన్, ఎఫ్ఎన్ కాల్వల ద్వారా సిమెంట్ లైనింగ్ పనులు పూర్తయితే మరో 5వేల ఎకరాలకు నీరందనున్నది.
మెదక్ జిల్లాలో మహబూబ్నహర్, ఫత్తేనహర్ కెనాళ్ల సిమెంట్ లైనింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. కాంట్రాక్టర్ పనులు వేగవంతంగా చేయడంతో త్వరలో ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాళ్ల పరిధిలోని భూములు సస్యశ్యామలం కానున్నాయి. నక్కవాగు నుంచి పోచమ్మరాల్ వరకు 10కిలోమీటర్ల మేర ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. సిమెంట్ లైనింగ్ పనులతో పాటు మధ్యలో గైడ్వాల్స్, తూములను కూడా నిర్మిస్తున్నారు. ఫత్తేనహర్ ప్రధాన కాల్వ 12.8 కిలోమీటర్లకు గానూ 12 కిలోమీటర్లు సిమెంట్ లైనింగ్ పూర్తి కాగా, 27 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ కాల్వలు ఉన్నాయి.