మెదక్ మున్సిపాలిటీ, మార్చి 22: పదో తరగతిలో ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 28న విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు (జీవో నంబర్ 33) జారీ చేసింది. గతంలో ఉన్న 11 పేపర్లకు బదులుగా ఇక నుంచి ఆరు పరీక్షలే నిర్వహించాలని, ఒక్కో సబ్జెక్ట్కు ఒక్క పరీక్ష మాత్రమే ఉండాలని నిర్ణయించారు. రెండేండ్ల క్రితం కరోనా నేపథ్యంలో 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లకు కుదించారు. అప్పట్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో పరీక్షలు రాయకుండానే విద్యార్థులందరినీ ఉతీర్ణులు చేసిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గడంతో గతేడాది కూడా ఆరు పరీక్షలే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022 మే 11 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహించారు. ఇక ఈసారి నుంచి 6 పేపర్ల ద్వారానే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ సైన్స్ పరీక్ష మాత్రం భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం ప్రశ్నాపత్రాల ఆన్సర్ షీట్లు వేర్వేరుగా ఇవ్వనున్నారు. వంద శాతం సిలబస్తోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. పరిస్థితులన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి విద్యాశాఖ అథికారులు పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చారు.
పదో తరగతి పేపర్లు తగ్గించడంతోపాటు పరీక్షా సమయం మరో అరగంట పెంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒక్కో పరీక్ష ఇప్పుడు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలు, 3 గంటల పాటు జరగనున్నది. సైన్స్ పరీక్షలో భౌతిక, జీవశాస్ర్తాలకు వేర్వేరు సమాధాన పత్రాల ఉండనున్నాయి. ఈ పరీక్షకు 3.20 గంటల వరకు సయమాన్ని కేటాయించారు.
ఒక్కో సబ్జెక్ట్కు 80 మార్కులు, ఫార్మేటివ్ అసెస్మెంట్కు 20 మార్కులు కేటాయించనున్నారు. సైన్స్ పేపర్లో భౌతిక, జీవశాస్ర్తాల్లో రెండింటింకి సగం సగం మార్కులు కేటాయించనున్నారు. ఒకేషనల్ పరీక్షల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభమై 11తో ముగియనున్నాయి.