దుబ్బాక, ఆగస్టు 24: కలియుగ ప్రత్యేక్షదైవమైన వేంకటేశ్వరస్వామి దుబ్బాక పట్టణంలో కొలువుదీరి భక్తులపాలిట కొంగుబంగారమయ్యాడు. బాలాజీ ఆలయం నిర్మించి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలకు సిద్ధమయ్యింది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో సకల హంగులతో ఆలయ నిర్మాణం జరిగింది. నాటి నుంచి నేటివరకు ఆలయంలో నిత్య పూజలు, వేడుకలతో తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచింది.
దుబ్బాక బాలాజీ ఆలయ నిర్మాణం సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో జరిగింది. ఆలయ నిర్మాణం పూర్తిగా టీటీడీ ప్లానింగ్ వాస్తుతో రూపొందించారు. సీఎం కేసీఆర్ సలహామేరకు ఆలయ పనులను ట్రస్టు సభ్యులు పూర్తి చేశారు. ఆలయ నిర్మాణానికి మొత్తం రూ.12 కోట్లు వెచ్చించారు. ఇందులో సీఎం కేసీఆర్ దేవాదాయ శాఖ నుంచి రూ.5.5 కోట్ల(ఎస్డీఎఫ్) నిధులు మంజూరు చేశారు. ఇందులో స్పెషల్ డెవలప్మెంట్ (దేవాదాయ శాఖ) నుంచి రూ.3 కోట్లు, కామన్ గుడ్ ఫండ్(సీజీఎఫ్) నుంచి రూ.2.5 కోట్లు మంజూరయ్యాయి. ఆలయ నిర్మాణానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్రెడ్డి తమవంతుగా ఆర్థిక సాయం అందజేశారు. వీరితోపాటు స్థానికులు, వ్యాపారులు, భక్తులు ఆలయానికి తమవంతు సాకారం అందించారు.
గురువారం నుంచి 28వ తేదీవరకు బాలాజీ ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా.. కేరళ, మహారాష్ట్ర నుంచి కళాకారులతో పాటు స్థానిక భజన కళాకారులు, యక్షగాన కళాకారులు, మహిళల కోలాటాలు, నృత్యాలతో మంగళవాయిద్యాలు, మేళతాళాల కార్యక్రమాలు ఉంటాయి.