మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 4: ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారులు పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. కొనసాగుతున్న శిక్షణా విధానాన్ని పరిశీలించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, పోస్టల్ బ్యాలెట్ వినియోగం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్ అధికారులు ముఖ్యంగా ఈవీఎం యంత్రాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. మాక్ పోల్ నిర్వహణ, ఈవీఎం యంత్రాల పనితీరు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ పాట్ల కనెక్షన్లు వాటి పనితీరు, మరమ్మతు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణ పొందే ఎన్నికల సిబ్బందికి ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలన్నారు. తొలి విడత శిక్షణ ఇప్పటికే పూర్తయిందని, ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్, కంట్రోలింగ్ యూనిట్, వీవీ పాట్ల అమరిక తదితర అంశాల గురించి అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. విధి నిర్వహణలో అధికారులకు పోస్టల్ బ్యాలెట్ అందజేస్తారని, ఓటు వినియోగానికి వీలుగా ఇక్కడే ఫెలిటిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు అమర్చుతారన్నారు. మొదటి విడత శిక్షణలో 488 మంది పీవోలు, ఏపీవోలు శిక్షణ పొందినట్లు తెలిపారు. రెండో విడత శిక్షణ ఈనెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్వీప్ అధికారి రాజిరెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జై చంద్రారెడ్డి, తహసీల్దార్లు శ్రీనివాస్, లక్ష్మణ్బాబు, సురేశ్, రజని, మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్, ఏప్రిల్ 4: ఓటర్లు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులపై ఉన్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవోగా విధులు నిర్వహించే సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై పీవో, ఏపీవోలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మార్గదర్శకాలు పాటించాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఈవీఎం, వీవీపాట్ల వినియోగం, సీల్ వేయుట, ప్రత్యేక ట్యాగ్, పోలింగ్ కేంద్రంలో వినియోగించే అన్ని రకాల స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ ఫారాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. పోలింగ్ ప్రారంభించడానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించే విధానంపై వివరించాలన్నారు. మాక్ పోలింగ్లో 50కి తక్కువ కాకుండా ఓట్లు వేయాలని, వేసిన ఓట్లు వీవీపాట్లలోని స్లిప్పులతో సరిచూసిన తదుపరి ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేసి అనంతరం నిర్దేశిత సమయంలోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. కలెక్టర్తో ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్లు కమలాద్రి, శ్రీనివాస్, ఆంజనేయులు, గఫార్, మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.