బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సాహం అందిస్తున్నది.ఇందుకు మెదక్లోని వెస్లీ ఉన్నత పాఠశాల సిద్ధమైంది. నేటి (గురువారం) నుంచి మూడు రోజుల పాటు జిల్లా స్థాయి రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శన జరుగనున్నది. ఇందులో విద్యార్థులు పాల్గొని ప్రయోగాలతో సత్తా చాటనున్నారు.జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబర్చే ప్రయోగాలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు.
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 23: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శన వేదిక కానున్నది.పాఠ్యాంశంలోని అంశాలే కాకుండా కొత్త అంశాలతో ప్రయోగాలను ప్రదర్శించేందుకు సన్నద్ధం చేస్తున్నారు. దీంతో విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు నాంది పలికేందుకు దోహదపడనున్నాయి. భవిష్యత్లో కొత్తదనంతో ప్రయోగాలను ప్రదర్శించడానికి విద్యార్థులు ఆసక్తి చూపనున్నారు. 50వ జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శన-2022ను (జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథ్స్ ఎన్విరాల్మెంట్ ఎగ్జిబిషన్ ఈ సారి నుంచి రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనగా రూపాంతరం చెందింది) ఈ నెల 24 నుంచి 26వతేదీ వరకు జిల్లా కేంద్రంలోని వెస్లీ పాఠశాలలో నిర్వహించనున్నారు జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఏడు ఉప అంశాలలో పాటు నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ఏవైనా ప్రయోగాలను ప్రదర్శించవచ్చు. 6వ తరగతి నుంచి 7వ తరగతి వరకు జూనియర్ విభాగంగా, 8 నుంచి పదో తరగతి వరకు సీనియర్ విభాగంగా పరిగణించనున్నారు. ఈ ప్రదర్శనల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రయోగాలను ప్రదర్శించవచ్చు. అలాగే విద్యార్థులతో పాటు సైన్స్, గణితం, అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులు, డీఈడీ, బీఈడీ శిక్షణ పొందుతున్న చాత్రోపాధ్యాయులు, బోధన ఉపకరణాలు అనే అంశంపై ప్రయోగాలను ప్రదర్శించడానికి అవకాశం కల్పించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా ప్రయోగాలు ప్రదర్శించడానికి చర్యలు తీసుకుంటున్నారు, సైన్స్, గణితం విషయాలకు సంబంధించిన ప్రయోగాలతో పాటు అన్ని విషయాలకు చెందిన ప్రయోగాలను ప్రదర్శించవచ్చని సైన్స్ అధికారి సూచిస్తున్నారు. ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు ప్రదర్శనకు సంబంధించి ప్రయోగ వస్తువులను తీసుకురావాలి. అలాగే తక్కువ పదాలకు మించకుండా అబ్స్ట్రాక్ట్ ఉంచాలి. ప్రయోగం పేరు, విధానం తెలిపే చార్టు కచ్చితంగా తయారు చేసుకొని రావాలి.
స్వయంగా తయారు చేసిన వాటినే అనుమతిస్తారు. రెడీమెడ్ నమూనాలు అనుమతించబడవు. తక్కువ ఖర్చుతో తయారు చేసిన ప్రయోగానికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక విద్యార్థితో పాటు ఒక గైడ్ టీచర్ మాత్రమే ఒక ప్రాజెక్ట్ ప్రదర్శనలో పాల్గొనాలి. ప్రదర్శనలో పాల్గొనే విదార్థులు 24వ తేదీ ఉదయం 8 గంటల్లోపే వెస్లీ పాఠశాలకు చేరుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్య అతిథులు వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించనున్నారు.
వైజ్ఞానిక ప్రదర్శనలో సుమారు 450 నుంచి 500 వరకు ప్రదర్శనలు ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 400 మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇన్స్పైర్కు సంబంధించిన మరో 40 మంది విద్యార్థులు వారి ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రదర్శన ఏర్పాట్లు, నిర్వహించే విధానాలపై సమీక్షించారు. కరోనా వల్ల రెండేండ్లు వైజ్ఞానిక ప్రదర్శన ప్రత్యేక్షంగా నిర్వహించలేదు. 2020-21, 2021-22లో ఆన్లైన్ ప్రదర్శించారు. 2019-20లో 350 ప్రదర్శనలు ప్రదర్శించగా 2020-21లో ఆన్లైన్లో 120, 2021-22లో ఆన్లైన్లో 88 ప్రయోగాలు మాత్రమే ప్రదర్శించారు.
ప్రదర్శన నిమిత్తం 18 కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీకి కన్వీనర్, కో కన్వీనర్తో పాటు సభ్యులు ఉంటారు. ప్రయోగాలు ప్రదర్శించే విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వసతి ఏర్పాటు చేశారు. ఉదయం టిఫిన్తో పాటు రెండు పూటల భోజన సౌకర్యం కల్పించనున్నారు.
ఒక్కో ప్రదర్శనకు వంద మార్కులు కేటాయించారు. విద్యార్థి సొంతంగా తయారు చేసి ఊహించి రాస్తే 20 మార్కులు, సైన్స్, గణిత భావనలు స్పష్టంగా కనిపిస్తే 15 మార్కులు, సైంటిఫిక్ సూత్రానికి 15 మార్కులు, ప్రయోగం తయారుచేసే విధానం కోసం 15 మార్కులు, సమాజానికి ఉపయోగపడేలా వినియోగించుకునేలా ఉంటే 15 మార్కులు, తక్కువ ఖర్చుతో లాభదాయకంగా ఉంటే 10 మార్కులు, ప్రయోగం వివరించే విధానానికి 10 మార్కుల చొప్పున కేటాయిస్తారు. గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు 5 శాతం, పట్టణ పరిధిలోని విద్యార్థులకు 3 శాతం వెయిటేజీ ఉంటుంది.
పాఠ్యాంశాల్లోని విషయాలు కాకుండా నూతన అంశాలతో కొత్తదనం ఉండేలా ప్రయోగాలను ప్రదర్శించేందుకు సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలి. సైన్స్పై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించే సైన్స్ కార్యక్రమాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల పాల్గొనేలా సహకరించాలి.
– రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి
విద్యార్థుల మేధాసంపత్తిని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడుతాయి. ఈ ప్రదర్శనలో అన్ని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను ప్రయోగాలు చేసేలా ప్రోత్సహించాలి. జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి పాఠశాల విద్యార్థులు తప్పకుండా పాల్గొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి.
– రమేశ్కుమార్, జిల్లా విద్యాధికారి
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో ప్రతిభ కనబర్చే ప్రయోగాలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. జిల్లా స్థాయిలో ప్రయోగాలు ప్రథమ స్థానంలో 15, ద్వితీయ స్థానంలో 15, తృతీయ స్థానంలో 15 ఎంపిక చేయనున్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన 15 ప్రయోగాలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు.
ప్రదర్శించాల్సిన అంశాలు
సమాచారం, ప్రసార
సాంకేతికతలో పురోగతి
పర్యావరణ అనుకూల పదార్థాలు
ఆరోగ్యం-పరిశుభ్రత
రవాణా-ఆవిష్కరణ
మానవ తప్పిదాలతో
పర్యావరణంపై కలిగే అనర్థాలు
(పర్యావరణ ఆందోళనలు)
ప్రస్తుత ఆవిష్కరణలతో చారిత్రక అభివృద్ధి
మన కోసం గణితం