సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 17: సంగారెడ్డి జిల్లాలో గృహలక్ష్మి పథకం కింద వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గృహలక్ష్మి, దళితబంధు, బీసీ, మైనార్టీ బంధు, కారుణ్య నియామకాలు, జీవో 58, 59 పురోగతి, ఆయిల్పాం సాగు, పంచాయతీ భవనాల నిర్మాణ పురోగతి, స్వీప్ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహలక్ష్మి దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అర్హుల దరఖాస్తులను సంబంధిత యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. రెండో విడత దళితబంధుకు అర్హుల జాబితాను అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బీసీ కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించి రెండో విడతలో నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారుల చొప్పున అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు.
జాబితా ఆమోదం పొందిన వెంటనే పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 19న మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీకి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రెండో విడత జిల్లా లక్ష్యం మేరకు గొర్రెల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 487 యూనిట్లను లబ్ధిదారులకు రెండో విడతలో అందించామన్నారు. వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 6.20 లక్షల మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించాలన్నారు. కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలన్నారు. జీవో 58, 59 పరిశీలన పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఆయిల్పాం సాగుకు జిల్లా లక్ష్యం మేరకు 5 వేల ఎకరాలను త్వరితగతిన గుర్తించాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1254 ఎకరాలను గుర్తించినట్టు వెల్లడించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అన్ని వర్గాల ప్రజలకు ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగించుకోవడంపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో నగేశ్, ఆయా శాఖల అధికారులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.