రామాయంపేట, మార్చి 18: రామాయంపేటలోని పెద్దమ్మ ఆలయంలో కల్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. శనివారం పెద్దమ్మ జాతరలో భాగంగా ఆలయంలోని పెద్దమ్మ, పెద్దిరాజులకు పట్నాలు గీసి, కల్యాణాన్ని జరిపించారు. పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వాహకులు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. డప్పుచప్పుళ్లతో పెద్దమ్మ బోనాలను ముదిరాజ్లు ఊరేగింపుగా దేవాలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో ఒగ్గు కళాకారులతో ఒగ్గు కథలు చెప్పించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని పెద్దమ్మ, పెద్దిరాజులను దర్శించుకున్నారు.
పెద్దమ్మ సన్నిధిలో బండ్ల ప్రదర్శన
ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయ సన్నిధికి బోనాలతో ఊరేగింపుగా ముదిరాజ్ కులస్తులు చేరుకున్నారు. దేవాలయం చుట్టూ బండ్ల ప్రదర్శన జరిగింది. అనంతరం దేవాలయంలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి కల్యాణానికి అమ్మవారిని దర్శించుకున్నారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, వార్డు కౌన్సిలర్లు పెద్దమ్మ, పెద్దిరాజు స్వామిని దర్శించుకున్నారు.