మెదక్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా కేంద్రంలోని దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం తడిసి ముద్దయింది. దీంతో కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్ర దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పది పడకల్లో కిడ్నీ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డయాలసిస్ కేంద్రంలోకి వర్షపు నీరు చేరి రోగులు తీవ్రఇబ్బందులు పడ్డారు. వెంటనే స్పందించిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గురువారం మధ్యాహ్నం జిల్లా కేంద్ర దవాఖానలోని డయాలసిస్ కేంద్రా న్ని సందర్శించారు. అక్కడే ఉన్న జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్తో పాటు కాంట్రాక్టర్తో మాట్లాడి డయాలసిస్ కేంద్రా న్ని వెంటనే మరో రూంలోకి తరలించాలని సూచించారు.
10 డయాలసిస్ పడకలు ఉన్నాయని వాటిలో ప్రతి రోజు 20 మందికి డయాలసిస్ చేస్తున్నారని తెలిపారు. కిడ్నీ రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా డయాలసిస్ కేంద్రంలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే కిడ్నీ రోగులు నరకయాతనకు గురవుతున్నారని, జనరేటర్ను ఏర్పాటు చేయాలని డాక్టర్ చంద్రశేఖర్కు తెలిపారు. మరో రెండు రోజుల్లో డయాలసిస్ కేంద్రాన్ని మరో రూంలోకి మార్చుతామని కాంట్రాక్టర్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి తెలిపారు. ఆమె వెంట జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గంగాధర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ వంజరి జయరాజ్ ఉన్నారు.
మంత్రి హరీశ్రావుతో ఫోన్లో మాట్లాడినఎమ్మెల్యే
మెదక్ జిల్లా కేంద్ర దవాఖాన ఆవరణలో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని మరో చోటికి మార్చాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుతో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. వర్షాల కారణంగా డయాలసిస్ కేంద్రంలోకి నీరు చేరడంతో కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మరో రూంలోకి మార్చాలని మంత్రి హరీశ్రావును కోరారు. వెంటనే స్పందించిన మంత్రి హరీశ్రావు వైద్యాధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లా డి డయాలసిస్ కేంద్రాన్ని మరో రూంలోకి తక్షణమే మార్చాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి కోట్లు ఖర్చు చేస్తున్నదని, రోగులకు మెరుగైన సేవలు అందించడంలో డాక్టర్లు ముందుండాలని, నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.