అన్నదాతలు ఆయిల్పామ్ సాగువైపు దృష్టిపెట్టారు. మంత్రి హరీశ్రావు సూచనలతో ప్రతి గ్రామంలో సాగుకు ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సూచనలు చేస్తున్నారు. గజ్వేల్ మండలంలో ఇప్పటి వరకు 90 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయగా, మరో 50 ఎకరాల్లో సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఆయిల్పామ్లో అంతర పంటలు సాగుచేస్తూ రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. పచ్చిమిర్చి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, టమాట సాగుచేస్తున్నారు. దాతర్పల్లికి చెందిన తోట లక్ష్మణ్, అహ్మదీపూర్ గ్రామానికి చెందిన మద్ది రాజిరెడ్డి ఆయిల్పామ్లో అంతరపంటలు సాగుచేస్తూ డబుల్ ఆదాయం పొందుతున్నారు.
గజ్వేల్ రూరల్, జనవరి 4: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సబ్సిడీపై ఆయిల్పామ్ మొక్కలు అందజేస్తూ సాగును ప్రోత్సహిస్తున్నది.గతేడాది ఆయిల్పామ్ సాగుపై వ్యవసాయాధి కారులు గ్రామాల్లో పర్యటించి చిన్న, సన్నకారు రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వమే మొక్కలు పంపిణీ చేయడంతో పాటు వారికి అండగా ఉంటుంది. ఎప్పటికప్పుడు పంటసాగు చేసిన రైతుల భూములను అధికారులు సందర్శించి పలు సూచనలు చేస్తున్నారు. గ్రామాల్లోని రైతులు అధిక సంఖ్యలో పంట సాగుచేసే విధంగా లక్ష్యాన్ని పెట్టుకొని అధికారులు ముందుకు సాగుతున్నారు. గజ్వేల్ మండలంలోని దాతర్పల్లికి చెందిన తోట లక్ష్మణ్, అహ్మదీపూర్ గ్రామానికి చెందిన మద్ది రాజిరెడ్డి ఆయిల్ పామ్లో అంతరపంటలు సాగుచేస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. ప్రభు త్వం 80 శాతం సబ్సిడీపై డ్రిప్, మొక్కలను సబ్సిడీపై రూ.20, ఈజీఎస్లో ఒక్కో మొక్కకు రూ. 5, ఎకరాలకు రూ.4200లను రైతులకు అందజేస్తున్నది. పంటలో ఎలాంటి మందులు పిచికారీ చేసినా రైతులకు ఆడబ్బులు కూడా ఇస్తున్నది. సాగు చేసిన ఆయిల్పామ్ను మూడేండ్ల పాటు కాపాడితే 30 ఏండ్ల వరకు దిగుబడి రానున్నది. గజ్వేల్ మండలంలో ఇప్పటి వరకు 90 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు చేయగా మరో 50 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రతియేడు ఎలాం టి పెట్టుబడి లేకుండా రైతులకు లాభాల పంట రానుంది. ప్రభుత్వం ఇప్పటికే ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్పామ్ను సాగుచేసేలా ప్రణాళికను రూపొందించుకొని గ్రామాల్లోని రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం గత మూడేండ్లుగా ఆయిల్పామ్సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నది. మూడేండ్లు కష్టపడి పంటను కాపాడితే 30 ఏండ్ల వరకు దిగుబడి రావడంతో రైతులకు అధికంగా లాభాలు వస్తాయనే ప్రచారంతో చాలా మంది రైతులు పంటను సాగుచేస్తున్నారు. గజ్వేల్ మండలం దాతర్పల్లికి చెందిన రైతు తోట లక్ష్మణ్ సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు ప్రోత్సాహంతో తనకున్న 10 ఎకరాల్లో ఆరు నెలల క్రితం ఆయిల్ పామ్ మొక్కలు నాటాడు. అధికారుల సూచనలతో తొమ్మిది మీటర్లకు ఒకటి ఎకరానికి 57 మొక్కల చొప్పున పది ఎకరాల్లో 570 పెట్టాడు. ఆయిల్పామ్ మొక్కల మధ్య ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండడంతో అందులో మూడు నెలల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఐదు వేల అరటి మొక్కలు (మొక్కకు రూ.8 చొప్పున) తీసుకొచ్చి నాటాడు.
వాటితో పాటు అంతరపంటగా టమాట, పచ్చి మిర్చి, వాటర్మిలాన్ సాగు చేశాడు. ప్రస్తుతం పచ్చిమిర్చి, టమాట పంటను మార్కెట్కు తరలిస్తున్నాడు. ఏడాదిలో ఒక సారి మాత్రమే అరటి కాత రావడంతో రెండేండ్ల పాటు పంటను సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయిల్పామ్లో అంతర పంటలు సాగు చేయడం లాభదాయకంగా ఉండడంతో మొగ్గుచూపాడు. అహ్మదీపూర్ గ్రామానికి చెందిన రైతు మద్ది రాజిరెడ్డి ఏడాది క్రితం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఎకరాకు 57 మొక్కల చొప్పున నాలుగు ఎకరాల్లో 228 ఆయిల్పామ్ మొక్కలు నాటాడు. గత ఏడాది అంతర పంటగా మొక్కజొన్న సాగుచేసి మంచి దిగుబడి సాధించాడు. ప్రస్తుతం మిర్చి, పొద్దుతిరుగుడు సాగుచేస్తున్నాడు. గతేడాది అంతరపంటగా సాగు చేసిన మొక్కజొన్న మంచి దిగుబడి వచ్చింది అందుకే ప్రస్తుతం పొద్దుతిరుగుడు, పచ్చి మిర్చి సాగు చేశాడు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నది. మంత్రి హరీశ్రావు ప్రోత్సాహంతోనే నాలుగు ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశా. గ్రామాల్లో రైతులు ఆయిల్పామ్సాగు చేసేందుకు మందుకొచ్చారు. మొక్కలు నాటి ఏడాది దాటింది. అందులో అంతర పంటలు సాగు చేశా. గతేడాది మొక్కజొన్న సాగు చేస్తే మంచి దిగుబడి రావడంతోపాటు లాభాలు వచ్చాయి. ప్రస్తుతం పచ్చి మిర్చి, పొద్దుతిరుగుడు పంటలు వేశా. అంతర పంటల సాగు లాభదాయకంగా ఉంటుంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు నిరంతరం రైతుల శ్రేయస్సు కోసమే తపిస్తారు. అందుకే రైతులు ప్రభుత్వ సూచనలు పాటించి సీజన్కు అనుగుణంగా పంటలు సాగుచేస్తున్నారు. గత సంవత్సరం కంటే ఈ యేడు ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరిగింది.
– మద్ది రాజిరెడ్డి, అహ్మదీపూర్
రాష్ట్ర మంత్రి హరీశ్రావు ప్రోత్సాహంతోనే పది ఎకరాల్లో ఆయిల్పామ్ పంటసాగు చేశా. పంట సాగు చేసి ఆరు నెలలు గడుస్తున్నది. ఆయిల్పామ్ పంట మధ్యలోఅంతర పంటగా పచ్చిమిర్చి, మూడు ఎకరాల్లో టమాట, ఐదు ఎకరాల్లో వాటర్మిలాన్ సాగు చేశా. ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండడంతో 5వేల అరటి మొక్కలు నాటా. ఇప్పటి వరకు ఆయిల్పామ్ పంట చాలా బాగుంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతోనే పంట సాగు చేసేందుకు ముందుకొచ్చా. రైతుల కోసం ఎప్పుడు ఆలోచించే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సూచనలతో ఆయిల్పామ్ సాగు చేశా. ఆయిల్పామ్ పంట ప్రయోజనం తెలిసిన తర్వాత గ్రామాల్లో చాలా వరకు రైతులు పంటసాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంలాగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లోని రైతులకు ఆయా ప్రభుత్వాలు చేయూత అందించి ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
– తోట లక్ష్మణ్, రైతు, దాతర్పల్లి