భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ప్రభుత్వం నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమం పండుగలా జరిగింది. హరితహారంలో భాగంగా కలెక్టర్లు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, కాలువలు, చెరువు గట్లపై పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. రామాయంపేట పట్టణంలోని యాదాద్రి పార్కులో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ మండలం పెద్దచింతకుంటలో కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ రమేశ్, తూప్రాన్ మండలం కూచారంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. సంగారెడ్డి జిల్లాలో పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు సమీపంలో కలెక్టర్ శరత్కుమార్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, పటాన్చెరు మండలం రుద్రారంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, జహీరాబాద్ మండలం రంజోల్లో ఎమ్మెల్యే మాణిక్రావు హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు.
– సంగారెడ్డి/ మెదక్ న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 26
అడవులను పెంచాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తూ పుడమి తల్లికి పచ్చని హారం వేస్తున్నారు. శనివారం భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మహాక్రతువులో భాగంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలను పట్టుకుని మొక్కలు నాటి నీరు పోశారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని యాదాద్రి పార్కులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటి నీళ్లు పోశారు.
నర్సాపూర్ మండల పరిధిలోని పెద్దచింతకుంట గ్రామం జలహనుమాన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రమేశ్ పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు. సంగారెడ్డి జిల్లా అందోల్లోని గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. తూప్రాన్ మండలం కూచారంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత స్థానికులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు.