ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ సర్కారు తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, భెల్ డిపోల ఎదుట శనివారం ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం ఆరుగంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎక్కడి బస్సులు అక్కడే నిలిపివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకొన్న నిర్ణయాన్ని గవర్నర్ గౌరవించడం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తమ జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తుంటే గవర్నర్ మాత్రం ఆమోదించకపోవడంతో తాత్సారం చేయడం ఎంతవరకు సమంజమని మండిపడ్డారు. ఇప్పటికే పలు బిల్లులను కావాలనే కక్షపూరితంగా నెలలపాటు తొక్కిపెట్టారని, ఇప్పుడు 43వేల మందికిపైగా కార్మికుల కుటుంబాలతో ముడిపడి ఉన్న ఆర్టీసీ బిల్లును కూడా కుంటిసాకులు చెబుతూ అడ్డుకోవడం తగదన్నారు.
– సంగారెడ్డి/ మెదక్ న్యూస్నెట్వర్క్ ఆగస్టు 5
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను బీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సిద్ధమైనా బిల్లును గవర్నర్ తమిళిసై అనుమతించకపోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు మండిపడ్డారు. రాష్ట్ర సర్కారు సముచితంగా ఉన్నా గవర్నర్ అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం ఉదయం రెండు గంటల పాటు బంద్ పాటించారు. ఈ సందర్భంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆయా డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
– మెదక్, సంగారెడ్డి నెట్వర్క్, (ఆగస్టు 5)
ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
జహీరాబాద్. ఆగస్టు 5: ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ ఆమోదించాలని జహీరాబాద్ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. శనివారం ఉదయం స్థానిక డిపో వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ చూస్తుంటే గవర్నర్ అడ్డుకోవడం సరికాదన్నారు. వెంటనే విలీనం బిల్లుపై తమిళిసై సంతకం చేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు నష్టం జరిగేలా గవర్నర్ వ్యవహరిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.
గవర్నర్ తీరుపై ఆర్టీసీ ఉద్యోగుల ఆగ్రహం
రామచంద్రాపురం, ఆగస్టు 5: రాష్ట్ర గవర్నర్ తమిలిసై తీరుపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తీరుకు నిరసనగా ఆర్సీపురం డివిజన్లోని భెల్ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన బిల్లును గవర్నర్కు పంపితే బిల్లును ఆమోదించకుండా తాత్సరం చేయడం సరికాదన్నారు. వేలాదిమంది కార్మికుల జీవితాలతో గవర్నర్ ఆడుకోవడం సరికాదని మండిపడ్డారు. గవర్నర్ బిల్లుని ఆమోదించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వెంటనే గవర్నర్ ఆర్టీసీ బిల్లుకి ఆమోదం తెలుపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు ప్రసాద్, వీఎస్ఎన్ రావు, పీఎం.రెడ్డి, వెంకటేశ్, కిశోర్, రమేశ్, భాస్కర్, రవి, శ్రీనివాస్, డీజేరావు, నరేందర్, కేవీజీ రెడ్డి, శంకర్, హరిలాల్ తదితరులు ఉన్నారు.
మెదక్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా
మెదక్ అర్బన్, ఆగస్టు 5: తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల వీలిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో మెదక్ ఆర్టీసీ ఉద్యోగులు డిపో ఎదుట ఉదయం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు బస్సులు ఆపి ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి క్యాబినెట్ ఆమోదించడంతో బిల్లును గవర్నర్ ఆమోదంచకుండా ఆడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతించకుండా తాత్సరం చేస్తూ ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో గవర్నర్ చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే బిల్లును ఆమోదించి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.
గవర్నర్ తీరును నిరసిస్తూ ధర్నా
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 5: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో కలుపుతామని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారని, దానికి గవర్నర్ తమిళసై అడ్డుపడుతుండడంతో నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సంగారెడ్డి బస్ డిపో ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలుపుతామంటే గవర్నర్ తమిళ సై అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. గవర్నర్ ఆమోదించని పక్షంలో పెద్దఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాఘవరెడ్డి, రీజినల్ అధ్యక్షుడు పీరయ్య, రీజినల్ చైర్మన్ పీఎస్ సత్యనారాయణ, డిపో కార్యదర్శి పోసానిపల్లి కృష్ణారెడ్డి, అధ్యక్షుడు ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
ఖేడ్ డిపో ఎదుట ఉద్యోగుల నిరసన : రెండు గంటలపాటు విధుల బహిష్కరణ
నారాయణఖేడ్, ఆగస్టు 5: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు ఆమోదం తెలపని గవర్నర్ తమిళిసై వైఖరిని నిరసిస్తూ శనివారం నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో ఉద్యోగులు రెండు గంటలపాటు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆర్టీసీ సేవలు స్థంభించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైతే తమ ఇబ్బందులు తీరతాయన్నారు. గవర్నర్ ఆర్టీసీ కార్మికులను దృష్టిలో పెట్టుకొని విలీన బిల్లును ఆమోదించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు నెహ్రూ, శంకర్, నర్సింగ్రావు, మల్కయ్య, సంగీత, శోభ, యుమున, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్లో కార్మికుల ఆందోళన
నర్సాపూర్, ఆగస్ట్ 5: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని గవర్నర్ ఆమోదించకపోవడంతో నర్సాపూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సులను డిపోలో నిలిపివేశారు. అనంతరం ఆర్టీసీ సిబ్బంది మాట్లాడుతూ దేవుడు వరమిస్తే పూజారి అడ్డుకున్నట్లుగా గవర్నర్ తీరు ఉందని ఏద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాజకీయం చేసి పొట్టకొట్టొదని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది శ్యామ్సుందర్గౌడ్, శేఖయ్య, వెంకట్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చిరుద్యోగులపై గవర్నర్కు అక్కసు
ఎన్నో ఏండ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులపై గవర్నర్ తమిళిసై అక్కసు చూపించడం సరికాదు. మా చిరకాల ఆకాంక్షను తీర్చేందుకు సీఎం కేసీఆర్ సార్ ముందుకొచ్చి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభిస్తే గవర్నర్ బిల్లును ఆమోదించకపోవడం చాలా బాధాకరం. ఆర్టీసీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి సహకరిస్తూ ఎంతో చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నాం. సీఎం కేసీఆర్ పెద్దమనసు చేయడంతో మా సమస్యలు శాశ్వతంగా తీరిపోతాయని సంతోషపడ్డం. గవర్నర్ వైఖరి మూలంగా ఆర్టీసీ ఉద్యోగులంతా నిరాశకు గురవుతున్నారు. గవర్నర్ మా ఇబ్బందులను గుర్తించి ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదించాలి. – నెహ్రూ, కండక్టర్, నారాయణఖేడ్ డిపో
గవర్నర్ తీరు సరికాదు
సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను సర్కారు ఉద్యోగులుగా గుర్తించడానికి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మా కలలను సాకారం చేయడానికి సీఎం శ్రీకారం చుడితే గవర్నర్ వీలిన బిల్లును ఆమోదించకపోవడం దారుణం. మూడేండ్లుగా ఎదురుచూస్తున్న మా సమస్యను పరిష్కరిం చడానికి సీఎం సారూ ముందుకొస్తే గవర్నర్ అడ్డుపుల్ల వేయడం సరికాదు. వెంటనే గవర్నర్ వీలిన బిల్లుకు ఆమోదం తెలపాలి. లేదంటే ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామం. మంచి మనస్సుతో బిల్లుకు ఆమోదం తెలుపాలని గవర్నర్ను కోరుతున్నాం.
– ఆర్.విజేందర్రెడ్డి, కండక్టర్, గుమ్మడిదల, జీడిమెట్ల బస్డిపో
గవర్నర్ బిల్లును ఆమోదించాలి
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల జీవితాలను మార్చేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆర్టీసీ ఉద్యోగుల బతుకులు బాగుపడడం గవర్నర్ తమిళసైకి ఇష్టం లేదు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతానంటే గవర్నర్ ఆమోదించకపోవడం చాలా బాధాకరం. వెంటనే బిల్లును ఆమోదించి కార్మికులు కుటుంబాలను ఆదుకోవాలి.
– ఎం.రాధాకృష్ణ, ఆర్టీసీ ఉద్యోగి, మెదక్
ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు
ఆర్టీసీ ఉద్యోగుల బతుకులు బాగుపడడం గవర్నర్ తమిళసైకి ఇష్టం లేదు. ఆర్టీసీ కార్మికుల కల నేరవేరే బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం చాలా దారుణం. బిల్లును వెంటనే ఆమోదం తెలపాలి. ఆర్టీసీ కార్మికులు కుటుంబాలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు.
– వాణి ఆర్టీసీ కండక్టర్, మెదక్
మేం బాగుపడడం ఇష్టం లేదు..
ఆర్టీసీ ఉద్యోగుల బతుకులు బాగుపడడం గవర్నర్ తమిళసైకి ఇష్టం లేదు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతానంటే గవర్నర్ ఆమోదించకపోవడం చాలా బాధాకరం. వెంటనే ఆయోదించి కార్నికుల కుటుంబాలను ఆదుకోవాలి.
– సీహెచ్ రవీందర్రెడ్డి, ఆర్టీసీ డ్రైవర్ సంగారెడ్డి డిపో
ఆమోదించకపోవడం సిగ్గుచేటు
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలుపుతామనడం హర్షణీయం. కానీ రాష్ట్ర గవర్నర్ ఆమోదించకపోవడం సిగ్గుచేటు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల పట్ల నిబద్ధతతో పని చేస్తుంచే గవర్నర్ రాజకీయం చేయడం సరికాదు.
– కిషన్, ఆర్టీసీ డ్రైవర్, సంగారెడ్డి డిపో
ఆమోదం తెలపాలి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం గవర్నర్కి పంపిస్తే ఆమోదించకుండా పెండింగ్ పెట్టడం సరికాదు. వేలాదిమంది ఆర్టీసీ కార్మికుల విషయంలో గవర్నర్ ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. రాజకీయాలు వేరే అంశాల్లో చేసుకోవాలి. కార్మికులు బతుకులతో ఆడుకోవద్దు. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గవర్నర్ వెంటనే బిల్లును ఆమోదించాలి, లేదంటే కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
– జేజే.ప్రకాశ్, భెల్ ఆర్టీసీ ఉద్యోగి, ఆర్సీపురం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కార్మికుల బతుకులు మార్చేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించడం హర్షదాయకం. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ అడ్డుకోవడం సరికాదు. ప్రభుత్వానికి గవర్నర్ సహకరించి వెంటనే ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపాలి. ప్రభుత్వంపై కక్షసాధింపుగా వ్యవహరించడం గవర్నర్కు తగదు. కార్మికుల బతుకుల్లో మట్టికొట్టొదు. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.
– బలరాముడు, భెల్ ఆర్టీసీ ఉద్యోగి, ఆర్సీపురం