చేగుంట, అక్టోబర్ 1: బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే మహిళా సంఘాల అభివృద్ధి జరుగుతున్నదని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన నార్సింగిలోని ఐకేపీ కార్యాలయంలో పైఅంతస్తు నిర్మాణానికి ఆదివారం పూజ చేశారు. అనంతరం మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సంఘాల తరఫున వారు అభివృద్ధి చెందడానికి రుణాలను అందజేస్తున్నారని అన్నారు.
రుణాలను తీసుకొని, అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని ఎంపీ మహిళలకు పిలుపునిచ్చారు. అనంతరం వల్భాపూర్లోని పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యువజన సంఘాల వారు ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ఎర్రం అశోక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మైలరాం బాబు, మహిళా సంఘాల సభ్యులు తదితరులున్నారు.