హుస్నాబాద్, అక్టోబర్ 14: సీఎం కేసీఆర్కు సెంటిమెంట్గా ఉన్న హుస్నాబాద్లో ఎన్నికల తొలి ప్రజా ఆశీర్వాద సభ నేడు జరుగనున్నది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి లక్షకు పైగా జనాన్ని సభకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆవరణలో పోలీసు అధికారులు, సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించి భద్రతా చర్యలపై చర్చించారు. బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్పై పలు సూచనలు చేశారు.
1. హుస్నాబాద్, అక్కన్నపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేర్ మండలాల నుంచి వచ్చే వాహనదారులు కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో,సెయింట్ జోసెఫ్ స్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో వాహనాలు పార్కింగ్ చేసుకొని సభాస్థలికి చేరుకోవాలి.
2. కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్ మండలాల నుంచి వచ్చే వాహనదారులు కరీంనగర్ రోడ్డు ఇండియన పెట్రోల్బంకు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేసుకోవాలి.
హుస్నాబాద్-కరీంనగర్, కరీంనగర్ -హుస్నాబాద్ వెళ్లే దారి ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ప్రజలు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలి. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనదారులు నాగారం, మహ్మదాపూర్, బొమ్మనపల్లి, సుందరగిరి నుంచి కరీంనగర్కు వెళ్లాలి. కరీంనగర్ నుంచి తిరిగి ఇదే దారిలో రావాల్సి ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు.