మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు వెనుకనుంచి ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవడంతో చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. మృతుల్లో తండ్రీ కొడుకు, వృద్ధ దంపతులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామం నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో బంధువుల ఇంట్లో దశదినకర్మ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
– చేగుంట, మే 21
చేగుంట, మే 21: బంధువు దశదిన కర్మకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని వల్లూర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగింది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్కు చెందిన తిప్ప శేఖర్(45), కవిత భార్యాభర్తలు. వీరి కుమారుడు యశ్వంత్(10). వీరు బతుకు దెరువు కోసం కొన్ని రోజుల కిందట నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి వెళ్లారు. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్కు చెందిన వృద్ధ దంపతులు బాలనర్సయ్య (70), మణెమ్మ(62), కవితకు దగ్గరి బంధువులు. ఆలూరుకు వెళ్లిన వీరు, కవితతో పాటు వారి సొంత ఆటోలో గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో మృతి చెందిన బంధువు 10 రోజున దశదిన కర్మకు వెళ్తున్నారు.
నార్సింగి మండలం వల్లూర్ జాతీయ రహదారిపైకి చేరుకోగానే వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో తిప్పా శేఖర్, అతడి కుమారుడు యశ్వంత్, వృద్ధ దంపతులు బాల నర్సయ్య, మణెమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. కవిత, మరో కొడుకు అవినాశ్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు, పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు. ఘటనా స్థలానికి నార్సింగి పోలీసులు చేరుకుని మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నర్సింహులు తెలిపారు.